కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా పండుగను చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలందరూ దసరా ఉత్సవాలను జరుపుకుంటామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం మంత్రి కార్యాలయం నుంచి దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా తమ తమ రంగాలలో సంపూర్ణ విజయం సాధించాలని తెలుగు ప్రజలందరికీ ఒక ప్రకటనలో మంత్రి తానేటి వనిత దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ , వైఎస్సార్ ఆసరా రెండు ఉత్సవాలు రాష్ట్రంలో మహిళలు ఒకేసారి జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా.. ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమంగా విజయం మంచినే వరిస్తుందని ఆమె అన్నారు. మహిషాసురుడిపై మహిళా స్వరూపంగా జగన్మాత సాధించిన విజయాన్ని దసరా ఉత్సవాలు ఇంటింటా ఘనంగా జరుపుకుంటామని గుర్తుచేశారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, ఆరోగ్యం, సిరి సంపదలతో తులతూగాలని, మహిళలు ఆర్ధిక పురోగతి సాధించాలని కోరుకొంటున్నట్లు ఆమె తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యక్తిగత స్వీయ నియంత్రణ తో చేతులు కడగడం, మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News