– మూడు సర్టిఫికేట్లు కైవసం చేసుకున్న కలెక్టరేట్
– అత్యుత్తమ ప్రమాణాలు పాటించిన 9 పంచాయతీలకు కూడా ఐఎస్వో సర్టిఫికెట్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో సర్టిఫికేషన్లు లభించాయి. పరిపాలనా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, ప్రజా సేవల మెరుగుదలలో తీసుకున్న చర్యలకు గుర్తింపుగా మూడు ఐఎస్వో సర్టిఫికేట్లు కలెక్టరేట్కు అందాయి. ఇంధన పొదుపు విధానాలు, హరిత, పర్యావరణ హిత ప్రోత్సాహక కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో సత్వర స్పందన, సంక్షేమ పథకాల అమలు తదితరాల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకుగాను ఈ సర్టిఫికెట్లు లభించాయి. ఐఎస్వో 50001: 2018, ఐఎస్వో 14001:2015, ఐఎస్వో 9001:2015 సర్టిఫికెట్లు లభించాయి. ప్రత్యేకంగా ఇంధన పొదుపు విధానాల అమలు, కార్యాలయాల్లో విద్యుత్ వినియోగ నియంత్రణ, హరిత–పర్యావరణ హిత కార్యక్రమాల ప్రోత్సాహం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పరిశుభ్రత పరిరక్షణ వంటి అంశాల్లో కలెక్టరేట్ విశిష్ట ప్రదర్శన కనబర్చింది. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారంలో సత్వర స్పందన, ప్రజలతో నేరుగా సంప్రదింపులు, అర్జీల పరిష్కార వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందింది. ఇక సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, అర్హులకు లబ్ధి చేరేలా తీసుకున్న చర్యలు, డిజిటల్ విధానాల వినియోగం, సేవల సరళీకరణ వంటి అంశాలు కూడా ఈ సర్టిఫికేషన్లకు దోహదపడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐఎస్వో సర్టిఫికేషన్లు సాధించడం కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది సమిష్టి కృషికి ఫలితమని పేర్కొన్నారు. ఇది గర్వకారణమే కాకుండా మరింత బాధ్యతను కూడా పెంచుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేందుకు, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక పరిపాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లా పరిపాలనలో నాణ్యతా ప్రమాణాలను నిరంతరం పెంపొందిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
అత్యుత్తమ ప్రమాణాలు పాటించిన 9 పంచాయతీలకు కూడా ఐఎస్వో సర్టిఫికెట్లు లభించాయి. అవి.. ముప్పాళ్ల (చందర్లపాడు మండలం), భీమవరం (వత్సవాయి), పెనుగంచిప్రోలు (పెనుగంచిప్రోలు), గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం), అంబాపురం (విజయవాడ రూరల్), గూడవల్లి (విజయవాడ రూరల్), నిడమానూరు (విజయవాడ రూరల్), ప్రసాదంపాడు (విజయవాడ రూరల్), గొల్లపూడి (విజయవాడ రూరల్).
కార్యక్రమంలో హిమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య ఆలపాటి, 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్పర్సన్గా తేజస్వి పొడపాటి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News