గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలోని ప్రసిద్ధ శ్రీ ఆనందవల్లీ సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుండి ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాల్లో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, భారతదేశంలోనే అత్యంత ప్రాచీన శివాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు. ఈ ఉత్సవాలు నేటి నుండి 23 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా జరుగుతాయని, ప్రధాన ఘట్టమైన మహా కుంభాభిషేకం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్య జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కోటి రామచంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు వంశీ కృష్ణ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News