– ఎక్కడా లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయండి
– పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 మే 3వ తేదీన జరగనుందని.. పరీక్ష నిర్వహణకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
నీట్ పరీక్షపై కలెక్టర్ లక్ష్మీశ సోమవారం సమన్వయ శాఖల అధికారులు, సూపరింటెండెంట్లు, పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 32 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 12 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులకు తప్పనిసరిగా ధ్రువీకరణ, బయోమెట్రిక్ హాజరు, ఫ్రిస్కింగ్ ప్రక్రియలు ఒకే ప్రవేశ ద్వారం ద్వారా జరుగుతాయన్నారు. పర్యవేక్షకులకు విధుల నిర్వర్తించడంపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలని.. నిషేధిత వస్తువులపై గట్టి నిఘా ఉండాలన్నారు. అవకతవకలు జరక్కుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు వంటి సున్నిత సామగ్రి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి సంబంధించి సీటింగ్, వీడియోగ్రఫీ, భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, వైద్య సదుపాయాలు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, తాగునీరు తదితర ఏర్పాట్లపై దృష్టిసారించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పరీక్షను విజయవంతంగా పూర్తిచేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో నీట్ సిటీ కోఆర్డినేటర్లు డా. ఎం.గోపీకృష్ణ, ఎం.వెంకటేశ్వరరావు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, ప్రజా రవాణా, పోలీస్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News