గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జనగణన అనేది దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రక్రియ అని, గుంటూరు నగరంలో స్వీయ జనగణనకు విద్యా వంతులు ముందుకు రావాలని, కేవలం తమ వివరాలు మాత్రమే కాకుండా, తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు మరియు సాంకేతిక పరిజ్ఞానం లేని తోటి వారికి కూడా వారి వివరాలను నమోదు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్చంద స్వీయ గణన ఈనెల 30వ తేదీ వరకు ప్రజలకు se.census.gov.in వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంటుందని, గుంటూరు నగరంలో ఇప్పటికే 22,183 మంది నమోదు చేసుకున్నారన్నారు. ఈ విధానం ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వీయ గణన షుమారు 2 నుండి 3 నిమిషాల్లో తేలికగా ఉందని, యువత పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఎస్.ఈ.ఐ.డి నెంబర్ కేటాయించబడుతుందని, ఆ నెంబర్ను తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని కమిషనర్ సూచించారు. మే నెల 1 వ తేదీ నుంచి జనాభా వివరాల సేకరణ కోసం ఎన్యూమరేటర్లు ఇంటింటికి వస్తారని, ఆ సమయంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారు తమ వద్ద ఉన్న ఎస్.ఈ.ఐ.డి నెంబర్ను సదరు సిబ్బందికి అందజేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు కూడా స్వీయ గణనలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.
Prajavartha Online Telugu News