-తల్లికి వందనం పడిందో లేదో డీఈఓ బాధ్యత తీసుకోవాలి
-విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తే కూటమి ధ్యేయం
-అద్దంకిలో విద్యార్థులకు 11,044 ఉచిత సైకిళ్ల పంపిణీ
-విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తును అందించడమే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మంత్రి గొట్టిపాటి మంగళవారం నాడు అద్దంకి నియోజవర్గంలో పర్యటించారు. ముందుగా సంతమాగులూరు మండలం కొప్పరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 72 మంది విద్యార్థులకు ఆసిస్ట్ స్వచ్ఛంధ సంస్థ సహకారంతో ఉచితంగా సైకిళ్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి విద్యార్థులతో ఇష్టాగోష్ఠి సంభాషించారు. ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 11,044 సైకిళ్లన పంపిణీ ఉచితంగా పంపిణీ చేశామన్నారు. దీనికి ఎందరో దాతలు సహకరించారన్న మంత్రి గొట్టిపాటి., మంచి పని చేయడానికి అందరూ ముందుకు వస్తారని తెలిపారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందన్న ప్రశ్నకు విద్యార్థులు బావుందని మంత్రి గొట్టిపాటికి సమాధానం చెప్పారు. మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక పాఠశాలలో అధికారులు మధ్యాహ్న భోజనం చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పినా ఎందుకు పాటించడం లేదని ఆయన ప్రశ్నించారు. తల్లిదండ్రులు కూడా మధ్యాహ్న భోజనం చేస్తూ పాఠశాల భోజనాల నాణ్యతను పరిశీలించాలన్నారు.
అధికారులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి….
కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. గతంలో ఒక్కో స్కూలుకు ఒకే టీచర్ ఉన్న పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని డిఎస్సీ ద్వారా ఒకేసారి 16,00కుపైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారన్నారు. నాణ్యమైన బ్యాగు, యూనిఫాం, షూలతో పాటు చదివే అందరికీ తల్లికి వందనం అందజేస్తున్నామన్నారు. తల్లికి వందనం నగదు లబ్ధిదారులకు అందుతుందో లేదో చూడాలని, అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత డీఈఓ, ఎంఈవో, ఇతర అధికారులదే అని మంత్రి గొట్టిపాటి తేల్చి చెప్పారు. కొప్పరం పాఠశాలకు త్వరలోనే డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలక కాంపౌండ్ వాల్ కు రూ.20 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, ప్రహరీ గోడ నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. పాఠశాలలో కార్యక్రమం పూర్తి అయిన తరువాత మంత్రి గొట్టిపాటి గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులకు అందించిన ఆయన., వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కొప్పారం గ్రామంలోని మసీదును మంత్రి గొట్టిపాటి సందర్శించి ప్రార్ఠనలు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నేతలు మంత్రి గొట్టిపాటిని సన్మానించారు.బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల పక్షపాతి అయిన కూటమి ప్రభుత్వంలోనే అందరికీ రక్షణ ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కొమ్మాలపాడులో కాపు కమ్యూనిటీ భవనం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి….
అద్దంకి నియోజకవర్గం, సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడులో రూ.50 లక్షలతో నిర్మించిన కాపు కమ్యూనిటీ భవనాన్ని మంగళవారం నాడు మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ., నియోజకవర్గంలో దాతల సహాయంతో నియోజకవర్గం మొత్తం మీద సుమారు 30 కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నామన్నారు. కొమ్మాలపాడులోనే ఇప్పటి వరకు సుమారు రూ.1.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వెల్లడించారు. మండలంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే ఏల్చూరు దగ్గర 11 ఎకరాల్లో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనను, సంక్షేమ, అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న కూటమి పాలనలో తేడాను ప్రజలే గమనించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News