విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఫ్యాప్టో నిరసన నిరాహార దీక్ష జరిగాయి. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఫ్యాప్టో పిలుపునిచ్చిన మలిదశ పోరుబాట ఉధృతంగా ప్రారంభమైంది. శనివారం విజయవాడలోని ధర్నా చౌక్ వేదికగా జరిగిన తొలిరోజు నిరాహార దీక్ష అపూర్వ స్పందనతో విజయవంతమైందని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి శనివారం వెల్లడించారు. ప్రధానంగా 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటితో పాటు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు, స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాలు, హైస్కూల్ ప్లస్ వ్యవస్థ బలోపేతం, పెండింగ్ డి.ఏల విడుదల, సరెండర్ లీవు బకాయిల చెల్లింపు వంటి 17 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు స్పష్టం చేశారు.ఈ పోరాటానికి ప్రజాప్రతినిధుల నుండి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, ఉత్తరాంధ్ర ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ నాయుడు ధర్నా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అలాగే పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. కృష్ణయ్య, ఎం. ప్రసాద్ రెడ్డి కూడా దీక్షకు మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, ఎన్టీఆర్, బాపట, నెల్లూరు, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చి దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర కోచైర్మన్లు కె. నరహరి, సిహెచ్. రమేష్, కాకి ప్రకాష్ రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్, కోశాధికారి చింతల సుబ్బారావు, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News