– మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలో ఏర్పాటు చేసే గూగుల్ ఏఐ డేటా సెంటర్ భారతదేశ డిజిటల్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవబోతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ శంకుస్థాపన చేస్తోన్న నేపథ్యంలో మంత్రి కొండపల్లి దీనిని ఏపీ చరిత్రలో అతి గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక దేశం మొత్తం ఏపీ వైపు చూడడం ఖాయం అన్నారు. రు. 87,520 కోట్ల పెట్టుబడితో గూగుల్ ద్వారా 1,000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ హబ్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ కార్పొరేట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) ప్రాజెక్టుగా నిలిచిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అకుంఠిత దీక్ష ఫలితంగానే గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ రాష్ట్రానికి తరలివచ్చిందని మంత్రి కొనియాడారు. గతంలో ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబు ఇప్పుడు ఏఐలో ఏపీని ప్రపంచస్థాయిలో నిలబెడుతున్నారని… గూగుల్ లాంటి సంస్థలను ఒప్పించి ఏపీకి తీసుకురావడంలో ఆయనకు ఆయనే సాటి అని మంత్రి కొనియాడారు.
ఐటీ మంత్రిగా నారా లోకేష్ క్షేత్రస్థాయిలో చేసిన కృషి మరువలేనిది… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో విశాఖపట్నాన్ని గ్లోబల్ టెక్ హబ్గా మార్చాలన్న ఆయన లక్ష్యం ఈ గూగుల్ ప్రాజెక్టుతో నెరవేరబోతోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాన్ని దేశంలోనే పొందుతోన్న తొలిరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని… ఇది నెక్ట్స్ జనరేషన్ ఏఐ టెక్నాలజీతో పాటు గ్లోబల్ డిజిటల్ ప్లాట్ఫామ్లకు వెన్నుముకగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ డేటా సెంటర్ ద్వారా ఏఐ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు, విశాఖపట్నం నగరం ప్రపంచ స్థాయి టెక్ హబ్ మారుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ‘స్వర్ణాంధ్ర @2047’ విజన్కు, భారత ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ బలాన్ని చేకూరుస్తుందని మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News