-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మూడు డిస్కంల సీఎండీలు పృథ్వితేజ, శివశంకర్, పుల్లారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ లు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వేసవి కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు సుమారు 275 నుండి 285 మిలియన్ యూనిట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా బ్రేక్డౌన్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా గృహా, వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయ వినిగియోగదారులకు నిరంతర సరఫరా కొనసాగించాలని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లు తగ్గిస్తూ.. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని సూచించారు. అదే విధంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ అమలును మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. పథకాల సమర్థవంతమైన అమలుకు ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం, ఆగస్టు నాటికి 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను తప్పక పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News