-ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి
-ఖాళీ స్థలాలను యజమానులు శుభ్రం చేసుకోకుంటే జిఎంసి బోర్డ్ లు పెట్టాలి
-నిర్మాణ వ్యర్ధాలను రోడ్ల పక్కన వేసే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలి
-అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డ్ సచివాలయాల వారీగా పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం ఏటి అగ్రహారం, రామిరెడ్డి నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో పారిశుధ్యం మరియు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు సరిగా జరగకపోవడాన్ని గమనించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన తరుణంలో విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ చెత్త సేకరణకు ప్రజారోగ్య కార్మికులు ఇంటి వద్దకే వస్తున్నారా లేదా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకొని, ప్రజలు కూడా బాధ్యతగా తడి, పొడి వ్యర్ధాలను వేరు చేసి అందించాలని సూచించారు. ముఖ్యంగా క్లస్టర్ మరియు హోమ్ కంపోస్టింగ్ విధానాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని, ప్రజారోగ్యానికి భంగం కలిగించే విధంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడ జిఎంసి బోర్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. నగరంలో నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒకసారి వ్యర్థాలను తొలగించిన తర్వాత తిరిగి అక్కడ వ్యర్థాలను వేస్తే భారీగా అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. అలాగే, ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, నిషేధిత ప్లాస్టిక్ వినియోగంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. వార్డ్ సచివాలయ కార్యదర్శులందరూ ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పారిశుధ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
పర్యటనలో ఎస్ఎస్ సాంబయ్య, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News