-మే 1 నుండి మే 31 వరకు జనగణన ప్రక్రియ కొనసాగుతుంది: ఎమ్మెల్యే యార్లగడ్డ
-దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనగణనే బలమైన పునాది
-ప్రతి ఇంటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలి : యార్లగడ్డ
-ప్రజలందరూ జనగణనను విజయవంతం చేయాలని పిలుపు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ఆయన స్వయంగా వినియోగించుకున్నారు. విజయవాడ ఎమ్మెల్యే కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని తన కుటుంబ వివరాలను జనగణన పోర్టల్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్వీయ నమోదు ప్రక్రియలోని ప్రాముఖ్యతను, వివరాలను నమోదు చేసే విధానాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం సత్కరించి, సెన్సెస్ మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగణన అనేది కేవలం జనాభా లెక్కల సేకరణ మాత్రమే కాదని, రాబోయే కాలానికి దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఇది ఒక బలమైన పునాది అని అన్నారు. మే1 నుండి ప్రారంభమై మే 31వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వ అధికారులు, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికీ వచ్చి వివరాలను సేకరిస్తారని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించి, ఈ జాతీయ కార్యసాధనలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News