-టాస్ నిర్వహించి జట్లకు శుభాకాంక్షలు, క్రీడాకారులతో సరదా సంభాషణ, క్రికెట్ ఆడిన యువ నాయకుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సోమవారం నిర్వహించిన చిన్ని గణ క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ సీజన్ – 2 కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొన్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాస్ నిర్వహించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా ముచ్చటించి, కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ:- సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ రెండో సీజన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వేసవి సెలవుల్లో యువతకు, పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచే ఇటువంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని తెలిపారు. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి అన్ని క్రీడలను ప్రోత్సహించడం అవసరమని, క్రీడల ద్వారా పిల్లల్లో స్పోర్టివ్ స్పిరిట్ పెంపొందుతుందని చెప్పారు. ఫిట్నెస్తో పాటు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించేందుకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో బాంబే కాలనీ, సింగ్నగర్, పైకాపురం ప్రాంతాల నుంచి సుమారు 60 జట్లు పాల్గొనడం అభినందనీయమని తెలిపారు, దాదాపు 10 రోజులపాటు హార్ట్ టెన్నిస్ బాల్తో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించడం మంచి ప్రయత్నమని అభిప్రాయపడ్డారు.
ఇటువంటి ప్రీమియర్ లీగ్లను భవిష్యత్తులో మరింత ప్రోత్సహించేందుకు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే స్టేడియంను అభివృద్ధి చేసి, ప్రామాణిక క్రికెట్ వేదికగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా బాస్కెట్బాల్, ఫుట్బాల్, త్రోబాల్ వంటి ఇతర క్రీడల్లో కూడా యువత, ముఖ్యంగా మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిభ ఉన్నవారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
చివరగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేసి, పాల్గొన్న అన్ని జట్ల సభ్యులకు ఆల్ ది వెరీ బెస్ట్ తెలిపారు, గెలుపోటములను స్పోర్టివ్ స్పిరిట్తో స్వీకరించాలని సూచించారు.
Prajavartha Online Telugu News