-అదనంగా ఉన్న వస్తువులను ఉన్నతాధికారుల సూచనల మేరకు పొరుగు జిల్లాల్లో వినియోగిస్తున్నాం
-అమ్ముకుంటున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్న హౌసింగ్ జిల్లా అధికారి వెంకట్రావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం మార్కెట్ యార్డ్ లో గత రెండు రోజుల క్రితం గృహ నిర్మాణాలకు సంబంధించిన స్టీల్ ను అక్రమంగా తరలించారని జరుగుతున్న ఆరోపణలను గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి ఎస్.వెంకట్రావ్ పత్రికా ముఖంగా ఖండించారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ఒక జిల్లాలో అదనంగా ఉన్న ముడిసరుకుని మరో జిల్లాలో వినియోగించుకునే వెసులు బాటు కల్పిస్తూ గత ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ 2187 జారీ చేసిందన్నారు. ఆ సర్క్యులర్ మేరకు అల్లూరి సీతారామరాజు (ఏ ఎస్ ఆర్)జిల్లా హౌసింగ్ అధికారి ఆ జిల్లాకు 950 టన్నుల స్టీల్ అవసరమని కోరగా కృష్ణాజిల్లాలో అదనంగా ఉన్న స్టీల్ అల్లూరి జిల్లాకు కేటాయించామన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అన్ని జిల్లాల అధికారులు సహకరించాలని పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో ఉన్న హౌసింగ్ యండీ ఆదేశాలను కూడా పరిశీలించి మే 4వ తేదీన అల్లూరి జిల్లాకు స్టీల్ కేటాయించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ అవసరాల కొరకు తరలించడాన్ని కూడా తప్పుబట్టడం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు కృష్ణాజిల్లాలో ఇళ్ల నిర్మాణాలకోసం 369 మంది లబ్ధిదారులకు 1845 టన్నుల స్టీల్ అందించామని తెలిపారు. మరో 238 టన్నుల స్టీల్ గోదాముల్లో నిల్వ ఉందన్నారు. ఇదే విధంగా మన జిల్లాలో అదనంగా ఉన్న సిమెంటును పొరుగు జిల్లాలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న కరగ్రహారంలోని హౌసింగ్ లే అవుట్ పరిశీలించిన రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర లబ్ధిదారులతో సమావేశమయ్యారన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజీలపై ఫిర్యాదు చేయడంతో వాటిని తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని గృహ నిర్మాణ అధికారి తెలిపారు. ఇళ్ల స్థలాలు కబ్జా చేస్తున్నారని, ఇల్లు కట్టుకోకుంటే రద్దు చేస్తామనే ఆరోపణలు కూడా అవాస్తవం అన్నారు. సెప్టెంబర్ లోగా ఇళ్ల నిర్మాణాలు చేసుకోకుంటే ప్రభుత్వం నుండి సబ్సిడీలు అందే అవకాశం కోల్పోతారని లబ్దిదారులకు సూచించడం జరిగిందన్నారు. నాలుగు నెలల క్రితం గుడివాడలో 10 టన్నుల స్టీల్ దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామని, స్టీల్, సిమెంటు దొంగతనం జరిగిందని, ఇల్లు రద్దు చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేయడం ఏ మాత్రం సబబు కాదని గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి ఎస్. వెంకట్రావ్ వివరించారు.
Prajavartha Online Telugu News