– ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణతో బహుళ ప్రయోజనాలు
– సాగునీటితో పాటు భూగర్భ జలాల వృద్ధికి దోహదం
– ప్రభుత్వ జల సంరక్షణ కార్యక్రమాలపై సర్వత్రా హర్షం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార–జలహారతి కార్యక్రమం కింద ఎన్టీఆర్ జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జి.కొండూరు మండలంలోని చెరువుమాధవరం గ్రామ పరిధిలో ఉన్న గ్రంథివాని చెరువుకు సంబంధించిన ఫీడర్ ఛానల్ ఫునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఫీడర్ ఛానల్ పునరుద్ధరణ పూర్తయితే వర్షాకాలంలో వచ్చే నీరు సక్రమంగా చెరువుకు చేరే అవకాశం కలుగుతుంది. దీంతో గ్రంథివాని చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, గ్రామంలోని వ్యవసాయ భూములకు సమృద్ధిగా సాగునీరు అందనుంది. చెరువు నిండుగా ఉండటం వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగి బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడుతుంది. అదేవిధంగా రైతులు వరి, మిర్చి, కూరగాయలు తదితర పంటలను సకాలంలో సాగు చేసుకునే అవకాశం పొందడంతో పాటు దిగుబడులు కూడా పెరిగే అవకాశముంది.
అదేవిధంగా గ్రామ పరిసరాల్లో పచ్చదనం పెరగడం, పశువులకు తాగునీటి సౌకర్యం మెరుగుపడడం, నీటి కొరత సమస్య తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు గ్రామ ప్రజలకు చేకూరనున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత చెరువుమాధవరం గ్రామం వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి, రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Prajavartha Online Telugu News