అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుర్ల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం విమానాశ్రయానికి వస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రుషికొండపై గత ప్రభుత్వం రాజ భవంతుల తరహాలో చేసిన నిర్మాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.600 కోట్లను ఖర్చు చేసి మరీ నిర్మించిన ఈ భవనాలు ఎన్నికల ముందు ఎవరూ చూడటానికి కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. ఎన్నికల ముందు విశాఖపట్నం పర్యటనలో పలుమార్లు పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్ గురించి ప్రస్తావించారు. అటుగా వస్తున్న ఉప ముఖ్యమంత్రివర్యులు ప్యాలెస్ ను ఒకసారి పరిశీలించాలని భావించి లోపలకు వెళ్లారు. 7 అతి పెద్ద భవనాలు, వీటిలోని మూడు ఇళ్లను నిర్మించిన తీరును ఎంపీ ఎం.భరత్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ప్యాలెస్ పరిసరాలను, సీ వ్యూ పాయింట్ ను బయట నుంచే చూసిన పవన్ కళ్యాణ్ అక్కడ పని చేస్తున్న సిబ్బందితో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు. భవనాల ఎత్తు, వాటి విస్తీర్ణం,వాటి మార్కెట్ ధర వంటి విషయాలను, అలాగే న్యాయ పరమైన అంశాలను పవన్ కళ్యాణ్ కి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, విశాఖ కార్పొరేటర్ పి.మూర్తి యాదవ్ వివరించారు. సుమారు 30 నిమిషాల పాటు రుషికొండ ప్యాలెస్ పరిసరాలను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి విమానాశ్రయానికి బయలుదేరారు.
Prajavartha Online Telugu News