– అమ్మాయిలు ఉన్నతంగా ఎదగాలి.. అందుకు మనం తోడుగా నిలవాలి.
– బాల్య వివాహాలను అడ్డుకునేందుకు సమష్టి కృషి అవసరం.
– జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడపిల్లల రక్షణ, చదువు మనందరి కర్తవ్యమని.. అమ్మాయిలు ఉన్నతంగా ఎదిగేందుకు, మనం తోడుగా నిలవాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి జి.ఉమాదేవి అన్నారు. విజయవాడ రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆటోనగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం బేటీ బచావో.. బేటా పఢావో కార్యక్రమం కింద కిశోర బాలికలు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి మాట్లాడుతూ బాల్యవివాహాలు జరక్కుండా చూడాలని.. ఈ విషయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాల వల్ల వచ్చే అనర్థాలను తెలియజేయాలన్నారు. సీడీపీవో జి.మంగమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని.. ఈ చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పోక్సో చట్టంతో పాటు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి డీసీపీవో రాజేశ్వరరావు వివరించారు. విద్యార్థులు ప్రలోభాలకు గురికాకుండా చదువుపై దృష్టిపెట్టి, ఉన్నత భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలన్నారు. హెల్ప్ లైన్ నంబర్లు (1098, 100, 112, 181, 101) గురించి కూడా వివరించారు. వన్ స్టాప్ సెంటర్ ఎస్ఐ వరలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు ఫోన్ వాడకాన్ని తగ్గించుకొని, చదువుపై దృష్టిపెట్టి తమకాళ్లపై తామునిలబడేలా గొప్పవారిని ఆదర్శకంగా తీసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూడాలన్నారు. పిల్లలు మానసికంగా బలంగా ఉండేలా ఒత్తిడికి గురికాకుండా ఎప్పటిపని అప్పుడు పూర్తిచేసుకోవాలని సైకాలజిస్ట్ కె.సునీత రాకేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News