మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు రుణాలు సకాలంలో అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకు అధికారులకు సూచించారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో ఏపీ సిపిడిసిఎల్, ఎల్ డి ఎం, సంబంధిత అధికారులతో సమావేశమై, జిల్లాలో విద్యుత్ డి ఇ, ఏఈలు, ఎనర్జీ అసిస్టెంట్లు, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు, బ్యాంకు మేనేజర్లు, వెండర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు కలెక్టర్ వివరించారు. పథకం అమలులో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు బ్యాంకు మేనేజర్లకు జూమ్ కాన్ఫరెన్స్లో పిపిటి ప్రజెంటేషన్ ద్వారా సూర్య ఘర్ పథకం గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్లో బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడుతూ పర్యావరణహితమైన సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించుకోవడం ద్వారా కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ ఎనర్జీ వినియోగించుకుని, విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు వినియోగదారులకు ఇది ఎంతో మంచి అవకాశం అని అన్నారు.
ఇళ్లపై సౌర పలకల అమరిక ఖర్చుపై ప్రభుత్వం రాయితీ కూడా అందజేస్తున్నదని, వినియోగదారులకు బ్యాంకు రుణాలు అందించి, ఈ పథకం అమలులో సహకరించాలన్నారు.
దేశవ్యాప్తంగా ఒక కోటి మందికి పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం కాగా, జిల్లాలో ఈ పథకం కింద అత్యధిక శాతం ప్రజలు ఈ పథకం ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోటిమంది పూర్తికాగానే సైట్ క్లోజ్ అవుతుందని, కావున వినియోగదారులు త్వరపడాలని సూచించారు. కావున బ్యాంకర్లు ఈ పథకం వినియోగదారులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందించాలని తద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ఏపీ సిపిడిసిఎల్ ఎస్ఇ సత్యానందం, విద్యుత్ శాఖ టెక్నికల్ అధికారి సుధాకర్, ఎల్ డి ఎం జయవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News