-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం, స్టీల్ ప్లాంట్కు సొంతగనులు కేటాయించి, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మద్దతు ప్రకటించారు. సిపిఐ శ్రేణులు ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయరాదనిÑ విశాఖ ఉక్కుకు క్యాపిటివ్ మైన్స్ కేటాయించి, ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న నిరసనలకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మద్దతునిస్తూ, పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొనాలని పిలుపునిస్తున్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం పబ్లిక్రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్లకు అప్పగిస్తూ, వారి ఆస్తులను పెంచుకునేందుకు ఉపయోగపడుతోంది. ‘విశాఖ ఉక్కు ` ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుటిలయత్నాలు చేస్తోంది. కేంద్రం ప్యాకేజీ పేరుతో మోసం చేస్తున్నది. విశాఖ స్టీల్కు క్యాపిటివ్ మైన్స్ను ఏర్పాటు చేసేందుకుగాని, సెయిల్లో విలీనం చేయడానికిగాని ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. పైగా విఆర్ఎస్ పేరుతో ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్నారు. మరోవైపు అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాపిటివ్ మైన్స్ కావాలని ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరడం సిగ్గుచేటు. ప్రైవేటు సెక్టార్లోని మిట్టల్ కంపెనీకి మైన్స్ కోసం ప్రయత్నిస్తున్న పాలకులు ప్రభుత్వ సెక్టార్లోని విశాఖ స్టీల్ నష్టాలపాలవుతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గం. ప్రభుత్వరంగ పరిశ్రమలపై ప్రజాప్రతినిధుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, అభివృద్ధిలపై పాలకుల తీరును నిరసిస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న నిరసన కార్యక్రమాల్లో సిపిఐ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు.