-ఏ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుందో ఆ ప్రాంతం సస్యాశ్యామలం అవుతుంది
-టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15 వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం తెలిపారు. రాజధాని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టిటిడి చైర్మన్ ఈవో జె.శ్యామల రావు, టీటీడీ బోర్డు మెంబర్లతో కలిసి శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీనివాస కళ్యాణోత్సవం అనంతరం స్వామి వారి దివ్య ఆశీస్సులతో అమరావతి పనుల పునర్నిర్మాణానికి అంకురార్పణ చేస్తామన్నారు. మొదటి విడతగా దాదాపు రూ. 37 వేల కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరగనుండడం ఆనందంగా ఉందన్నారు. ఏ ప్రాంతంలో అయితే శ్రీనివాస కళ్యాణం జరుగుతుందో ఆ ప్రాంతం సస్యాశ్యామలం అవుతుందని భక్తుల నమ్మకం అని అన్నారు.
ఈ రోజు ఉదయం అమరావతి రైతులతో, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణంలో రాజధాని రైతులతోపాటు, ప్రజలు కూడా అంతేకాకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాకంక్ష అన్నారు. శ్రీవారి కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు , రాజధాని రైతులు , వివిధ గ్రామాలు, ప్రాంతాల నుండి ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటారని తెలిపారు.
టిటిడి ఈవో జె.శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
టిటిడి చేపట్టిన ఏర్పాట్లను ఈవో జె.శ్యామలరావు మీడియాకు వివరిస్తూ….
శ్రీవారి ఆలయం : శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల నుండి అర్చక స్వాములు, వేద పండితులు, వారితోపాటు మంగళ ధ్వని, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు విచ్చేస్తున్నారు.
ఇంజనీరింగ్ : కళ్యాణ వేదిక నిర్మాణంతో పాటు 27 వేల మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నాం. గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ప్రాంతాలలో ఫ్లెక్సీ బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేశాం.
ఎలక్ట్రికల్ విభాగం : శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు, కళ్యాణ వేదిక పరిసర ప్రాంతాలలో విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశాం. వేదిక చుట్టూ భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేశాం. నిరంతరాయంగా జనరేటర్స్ ద్వారా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నాం.
సెక్యూరిటీ : టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం నుండి 160 మంది, గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 600 మందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్ మెంట్ సహకారంతో 5 డ్రోన్లు, 70 సీసీ కెమెరాలు భద్రత , పర్యవేక్షణకు ఏర్పాటు చేశాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం.
పార్కింగ్ : ఆలయం వెనుక వివిఐపీల కొరకు 400 వాహనాలకు , ఆలయం కాంపౌండ్ వాల్ వెనుక 1000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాం. అదేవిధంగా సీడ్ యాక్సిస్ రోడ్డు దక్షిణం వైపు 1500 వాహనాలకు పార్కింగ్ స్థలం కేటాయించాం.
అన్నప్రసాదాలు : శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనే భక్తులందరికీ శ్రీవారి సేవకుల సహకారంతో మంచి నీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశాం.
ప్రజా సంబంధాలు/ఎస్వీబీసీ : HDPP ప్రచార రథాల ద్వారా శ్రీవారి ఆలయం సమీపంలోని 27 గ్రామాలలో ఇంటింటికి కరపత్రాలు, వాల్ పోస్టర్స్ పంపడం జరిగింది.
శ్రీనివాస కళ్యాణాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. మీడియా వారికి లైవ్ ఫ్రీక్వెన్సీ లోగో లేకుండా ఇస్తాం. టిటిడి పిఆర్ విభాగం మరియు జిల్లా ఐ అండ్ పిఆర్ విభాగం ద్వారా పత్రికా ప్రకటనలు, ఫోటోలు మీడియాకు పంపిస్తాం.
శానిటేషన్ : శ్రీవారి ఆలయంతో పాటు కళ్యాణ వేదిక , పరిసరాలు మరియు పార్కింగ్ స్థలాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి వందమంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశాం. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం కల్యాణ వేదిక పరిసరాలలో దాదాపు వంద మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తున్నాం
వైద్య విభాగం : ఆలయ పరిసరాలలో ప్రత్యేకంగా రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ వైద్య శిబిరాలలో తగినంత మంది డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందితోపాటు రెండు అంబులెన్స్ లు అందుబాటులో ఉంచుతున్నాం.
రవాణా : వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు APSRTC సహకారంతో 300 బస్సులతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం.
గార్డెన్ విభాగం :
వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో స్వామివారి ఆలయంతో పాటు కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దుతాం.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు :
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు చెన్నైకి చెందిన ప్రముఖ కళాకారిణి నిత్యశ్రీ మహాదేవన్ చే శ్రీనివాస సంకీర్తనం. సాయంత్రం 5 గంటల నుండి 6.15 గంటల వరకు చెన్నైకి చెందిన ప్రియా సిస్టర్స్ బృందం అన్నమాచార్య సంకీర్తనలు, సాయంత్రం 6.20 గంటలకు ప్రముఖ భగవద్గీత ఉపన్యాసకులు గంగాధర శాస్త్రి చే టిటిడి ధార్మిక, ఆధ్యాత్మిక ఉపన్యాసం, సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు నిర్వహించే శ్రీనివాస కళ్యాణం వ్యాఖ్యాతగా సరస్వతీ పుత్రులు, సహస్ర అవధాని డాక్టర్ మేడసాని మోహన్ వ్యవహరిస్తారు.
కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, ఎం. శాంతారామ్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, తదితరలు పాల్గొన్నారు.