రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మానసిక వికలాంగత్వం (ఎమ్.ఆర్), మానసిక అనారోగ్యం (ఎమ్.ఐ) కేటగిరీల కింద తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేయబడిన వారికీ ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు నిలుపుదల కావని, ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయబోమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 4,328 మంది ఈ రెండు కేటగిరీల కింద పెన్షన్లు పొందుతున్నారు. వారిలో ఇప్పటివరకు 1,402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 477 మందికి నోటీసులు జారీ చేశారు.
ఎమ్.ఆర్ కేటగిరీలో: 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 256 మందికి తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేశారు. ఎమ్.ఐ కేటగిరీలో: మొత్తం 1,157 మందిలో 429 మందికి పరీక్షలు జరగగా, అందులో పెన్షన్ నిలిపివేసిన 206 మందిలో 204 మంది 18 ఏళ్ల లోపు వారే అని, వారికి తాత్కాలిక ధ్రువపత్రం జారీ చేశామని కలెక్టర్ వివరించారు. కాబట్టి, తాత్కాలిక ధ్రువపత్రం ఉన్న ఎవరికీ నోటీసులు రాకపోవడంతో పాటు, పెన్షన్లు నిలుపుదల కానని స్పష్టంగా తెలిపారు. అర్హుల పెన్షన్లు నిలుపుదల కావు – ఆగస్టు 25లోగా అప్పీల్ చేసుకోవాలి. మిగిలిన కేటగిరీల్లో నోటీసులు అందుకున్న వారు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. అవయవ సంబంధ, వినికిడి లేదా చూపు సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులు తమ పరిధిలోని మున్సిపల్ కమిషనర్లు లేదా మండల ప్రజా అభివృద్ధి అధికారులకు ఆగస్టు 25లోగా అప్పీల్ చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి పెన్షన్ నిలుపుదల జరగదని కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జి.జి.హెచ్. సూపరింటెండెంట్ డా. ఎమ్. లక్ష్మి సూర్యప్రభ, డీ.ఆర్.డీ.ఎ పీడీ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, డి.సి.హెచ్.ఎస్. పద్మ, వైద్యులు ఎల్. సాయి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News