రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజానగరం నియోజకవర్గం, రాజా నగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో సందడి చేసే విదేశీ పక్షులను సంరక్షణకు, వీటిని చూడ్డానికి వచ్చే సందర్శకులకు సదుపాయాలతో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాజానగరం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శుక్రవారం పుణ్యక్షేత్రం గ్రామంలో అటవీశాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, నాలుగు కోట్ల రూపాయలతో పుణ్యక్షేత్రం పక్షుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. విదేశాల నుంచి వలసవచ్చే పక్షులను స్థానికులు తమ ఇంటి ఆడపడుచుల్లా ప్రేమగా చూసుకుంటున్నారని అన్నారు. దాదాపు 125 సంవత్సరాలుగా ఈ పక్షులు పుణ్యక్షేత్రం గ్రామానికి వస్తున్నాయని, గ్రామంలోని పెద్ద చెట్లపై గూళ్ళు కట్టి సుమారు ఆరు నెలలపాటు ఇక్కడే నివసిస్తూ గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతాయని వివరించారు.
పుణ్యక్షేత్రం ఊర చెరువును అభివృద్ధి చేసి, సందర్శకుల కోసం వాచ్ టవర్లు, చిల్డ్రన్ ప్లే జోన్లు, పక్షుల ఆవాసాల కోసం ప్రత్యేక నిర్మాణాలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ పక్షుల సంరక్షణ కేంద్రం కేవలం టూరిస్ట్లకే కాకుండా విద్యార్థులు, పరిశోధకులు, పక్షి ప్రేమికులకు కూడా ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో రాజమండ్రి జిల్లా అటవీ అధికారి వి. ప్రభాకరరావు, రాజమండ్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డేవిడ్ రాజు, డిప్యూటీ రేంజర్ పద్మావతి దేవి, ఎమ్మార్వో జి.ఏ.ఎల్.ఎస్. దేవి, ఎంపిడివో ఝాన్సీ, ఈవోపిఆర్డీ, విద్యుత్ శాఖ అధికారులు, వెటర్నరీ వైద్యులు, ఆర్డబ్ల్యు ఎస్ అధికారులు, ఫిషరీస్ శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News