రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి గారు ఉమెన్స్ కాలేజీ సమీపంలోని బాలికాసదానం గవర్నమెంట్ చిల్డ్రన్ వసతి గృహాన్ని, అలాగే బాలాజీపేటలోని ఏకలవ్య చిల్డ్రన్ ఫర్ బాయ్స్ వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలికాసదానంలో విద్యార్థినులతో మాట్లాడిన ఆమె మంచి–చెడు స్పర్శల గురించి అవగాహన కల్పించారు. పిల్లల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, మోసపూరితంగా వారిని అక్రమ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని తెలిపారు. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వరూ వారి పట్ల హద్దులు దాటి ప్రవర్తించరాదని స్పష్టం చేశారు.
వసతి గృహాలను పరిశీలించిన కార్యదర్శి గారు సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షిత త్రాగు నీరు, మంచి ఆహారం అందించడంతో పాటు వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అవసరమైన మరమ్మత్తులను ఎప్పటికప్పుడు చేయాలని, అలాగే విద్యార్థులకు అవసరమైన వైద్య సహాయం వెంటనే అందేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థుల ఆహారం నాణ్యతలో ఎటువంటి లోపం ఉండకూడదని, వారికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవల గురించి విద్యార్థులకు వివరించిన శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి, వసతి గృహాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా లేదా న్యాయ సహాయం అవసరమైనా నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు. విద్యార్థుల హక్కులను రక్షించడానికి న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలియజేశారు.
Prajavartha Online Telugu News