-కలెక్టరేట్లోడైరెక్టర్ ప్రియా సౌజన్య సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి స్వంత గృహం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు సాగుతోందనీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ ప్రియా సౌజన్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ ప్రియా సౌజన్య గురువారం జిల్లా కలెక్టరేట్లోని జిల్లా హౌసింగ్ ప్రధాన అధికారి కార్యాలయాన్ని సందర్శించి, గృహ నిర్మాణ సంస్థ పనితీరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. బుజ్జి మరియు జిల్లా హౌసింగ్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జిల్లాలో జరుగుతున్న గృహనిర్మాణ కార్యక్రమాలపై సమగ్ర వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రియా సౌజన్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (2.0) పథకం ద్వారా గృహనిర్మాణం వేగవంతం చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్రము మరియు రాష్ట్రం కలిసి పేదల సంక్షేమం దిశగా ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు.
అర్హులైన కుటుంబాలు తమ ప్రాంతంలోని గృహనిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాలు లేదా గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ సహాయకుల ద్వారా ఆవాస్ ప్లస్ యాప్లో దరఖాస్తులు సమర్పించ వచ్చని ప్రియా సౌజన్య వివరించారు. జిల్లాలో మూడు లక్షల గృహ ప్రవేశాలు పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గృహనిర్మాణం పేదల జీవన ప్రమాణాలను మార్చే దిశగా పెద్ద మలుపు తీసుకు వస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన మూడు లక్షల గృహప్రవేశాల లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని హౌసింగ్ శాఖ వేగవంతంగా చర్యలు కొనసాగిస్తోందనీ జిల్లా హౌసింగ్ అధికారి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ బుజ్జి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,794 గృహాల లక్ష్యానికి 7,394 గృహాలు పూర్తై 69 శాతం పురోగతి సాధించామని తెలిపారు. మిగిలిన 3,400 గృహాలను నవంబర్ చివరినాటికి పూర్తి చేయడానికి అన్ని నియోజకవర్గాల హౌసింగ్ ఇంజనీర్లు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. బుజ్జి, కార్య నిర్వాహక ఇంజనీర్ సి. హెచ్. వేణుగోపాలస్వామి (కొవ్వూరు డివిజన్), రాష్ట్ర హౌసింగ్ జేఏసీ అధ్యక్షులు కె. ఎస్. చక్రవర్తి, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News