-మంత్రులు –కార్యదర్శుల సమావేశంలో జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న “మంత్రులు–కార్యదర్శుల కాన్ఫరెన్స్”లో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్డీపీ వృద్ధి, జిల్లా వారీ పనితీరు, స్వర్ణాంధ్ర@2047 విజన్ లక్ష్యాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఆర్ ఎమ్ సి కమిషనర్ రాహుల్ మీనా , డి ఆర్వో టి సీతారామ మూర్తి, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఇతర క్షేత్ర స్థాయి అధికారులు ఆయా ప్రాంతాల నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులకు సూచనలు చేస్తూ, తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర జీఎస్డీపీకి సుమారు 4 శాతం వాటా కలిగి 12వ ర్యాంక్ను నిలబెట్టు కోవడం అభినందనీయమని, మెరుగైన స్థానం కోసం సమష్టి కృషి అవసరం అని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా జీడీడీపీ రూ.70,512 కోట్లకు చేరుకుని 10.24 శాతం వృద్ధిని నమోదు చేయడం వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
అయితే రాష్ట్రంలో టాప్–10 జిల్లాల సరసన తూర్పు గోదావరి జిల్లా నిలవాలంటే పరిశ్రమల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, సేవారంగ అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. మౌలిక వసతుల మెరుగుదల, ఉపాధి అవకాశాల సృష్టి, సమన్వయంతో కూడిన అభివృద్ధి కార్యక్రమాల అమలుతో జిల్లాను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని అధికారులను కోరారు.
అగ్రి & అలైడ్ సెక్టార్లో జిల్లాకు 81 స్కోర్తో ‘A’ గ్రేడ్ రావడం సానుకూలమని, రాష్ట్ర సగటు 91 స్కోర్ (A+) స్థాయికి చేరుకునే స్పష్టమైన అవకాశం మనకు ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా 18వ స్థానంలో ఉన్నప్పటికీ, కీలకమైన 10 సూచికలలో ఇంకా మెరుగుదల సాధించవచ్చని తెలిపారు. ఉత్పత్తి విలువ పెంపు, అనుబంధ రంగాల సమన్వయం, రైతు ఆధారిత సేవల వేగవంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, సామాజిక, మౌలిక వసతులు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, శాంతి భద్రతలు వంటి అంశాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. 2026–27 సంవత్సరానికి కేంద్ర ప్రాయోజిత పథకాల కార్యాచరణ, ఆదాయార్జన శాఖల పనితీరు, పీపీపీ ప్రాజెక్టులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రియల్ టైమ్ గవర్నెన్స్లో ఏఐ, డేటా లేక్, అవేర్ వంటి సాంకేతిక సాధనాల వినియోగంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News