-ఎగుమతుల దిశగా ముందడుగు వేయాలి: నర్సరీ రైతులకు కలెక్టర్ పిలుపు
-కడియం నర్సరీలకు గ్లోబల్ బ్రాండ్గా ఎదగాలంటే అవగాహన కీలకం
-కలెక్టర్ కీర్తి చేకూరి
కడియం / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అందమైన పూలు, అలంకరణ మొక్కలకు ప్రఖ్యాతి గడించిన కడియం నర్సరీ రైతులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.
గురువారం కడియంలో నిర్వహించిన “కడియం నర్సరీ నుండి ఎగుమతికి గల అవకాశాలు మరియు వ్యూహాలపై వర్క్షాప్” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కడియం నర్సరీలకు జాతీయ స్థాయిలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఎగుమతుల దిశగా మరింత చొరవ చూపాలని రైతులకు సూచించారు.
దేశవ్యాప్తంగా నర్సరీల నుంచి కోట్ల రూపాయల విలువైన మొక్కలు విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ, ఎంతో పేరెన్నికగన్న కడియం నుంచి తక్కువ స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్లనే రైతులు అంతర్జాతీయ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు.
ప్రస్తుతం కేవలం సుమారు 10 సంస్థలు మాత్రమే ఎగుమతి లైసెన్సులు కలిగి ఉన్నాయని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల మార్కెటింగ్ విధానాలు, ఎగుమతి అవకాశాలపై అవగాహన పెంపొందించుకుంటే రైతుల ఆదాయం మరింతగా పెరుగుతుందని వివరించారు.
నర్సరీ రైతులు గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, ఈ దిశగా ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు, నర్సర్సి రైతులు , ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News