రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) గోదాములను జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. పరిశీలన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, EVMల భద్రత, నిల్వ విధానం, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా సిబ్బంది ఏర్పాటు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు వెల్లడించారు. గోదాముల వద్ద ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని సూచించారు.
ప్రత్యేకంగా 24 గంటల సీసీటీవీ నిఘా నిరంతరంగా కొనసాగాలని, తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది నియామకం ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే, కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ అన్ని భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు, తహసిల్దార్ పాపారావు, స్థానిక నాయకులు యేళ్ళ వీరభద్రరావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News