గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా, స్థానిక భవన యజమానులకు సమస్యలు లేకుండా శ్యామలా నగర్ రైల్వే గేటు దగ్గర ఆర్.ఓ.బీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్యామల నగర్ రైల్వే గేటు పరిసర ప్రాంత భవనాల యజమానులు, రైల్వే, జిఎంసి అధికారులతో సంయుక్త సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా తొలుత రైల్వే అధికారుల ప్రతిపాదనలు, వారు చేసిన ట్రాఫిక్ సర్వే అంశాలను వివరించి, అనంతరం హాజరైన స్థానికుల అభిప్రాయాలను తెలుసుకొని, కమిషనర్ మాట్లాడుతూ ఆర్ఓబీ లేదా ఆర్యూబీలు ఏదైనా గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం చేయడానికేనని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్మాణం చేయడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న అంశాలను, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, రైల్వే ఇంజినీరింగ్, జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు త్వరలో సంయుక్త క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. అనంతరం తాము కూడా పరిశీలించి, వారం రోజుల్లో మరొక సమావేశం నిర్వహించి, ఆర్ఓబీ లేదా ఆర్యూబీ అనే అంశంపై నిర్ణయానికి వద్దామని తెలిపారు.
సమావేశంలో రైల్వే డిప్యూటీ సిఈ నాయుడు, జిఎంసి సిటి ప్లానర్ రాంబాబు, డిసిపీ సూరజ్ కుమార్, ఏసిపీ రెహ్మాన్, శ్యామల నగర్ రైల్వే గేటు పరిసర ప్రాంత భవన యజమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News