రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో కోకో సాగు నాణ్యతను మెరుగుపరచి అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారతీయ కోకో బీన్స్కు ప్రమాణాల రూపకల్పన అవసరమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్పీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్-ఎన్ఐఆర్సీఏలో నిర్వహించిన “ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ కోకో బీన్స్” అంశంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, కోకో పంటకు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించడం ద్వారా అధిక ధరలు పొందే అవకాశాలు పెరుగుతాయని, ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నాణ్యమైన ముడి పదార్థం అత్యంత కీలకమని పేర్కొన్నారు. కోకో విలువ శృంఖల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా కోకో ఉత్పత్తుల నాణ్యతను మరింత మెరుగుపరచవచ్చన్నారు. పంట అనంతర నిర్వహణ, ఫర్మెంటేషన్, ఎండబెట్టే విధానాల్లో అవగాహన పెంపు ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పారిశ్రామికవేత్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, నాణ్యమైన కోకో ఉత్పత్తి కోసం పరిశోధన, విస్తరణ సేవలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కీలకమని వివరించారు. రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులపై నిరంతర శిక్షణ అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోకో నాణ్యతాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తి సాధనపై ఉద్యానవన శాఖ దృష్టి సారించిందని తెలిపారు.
ఏపీఎఫ్పీఎస్ సీఈఓ గెడ్డం శేఖర్ బాబు మాట్లాడుతూ, కోకో రైతులను ప్రాసెసింగ్ పరిశ్రమలతో అనుసంధానం చేయడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. నాణ్యతా ప్రమాణాల ఏర్పాటు ద్వారా రాష్ట్ర కోకోకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కోకోశాల (చెన్నై) వ్యవస్థాపకుడు, కన్సల్టెంట్ నితిన్ చోర్డియా సాంకేతిక సెషన్లో మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో కోకో బీన్స్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యత ప్రమాణాలు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. కోకో గింజల ఫర్మెంటేషన్, ఎండబెట్టడం, గ్రేడింగ్, నిల్వ విధానాల్లో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను వివరించారు. చాక్లెట్, కోకో పౌడర్, కోకో బటర్ తదితర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవకాశాలపై రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు.
వక్తలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 38,671 హెక్టార్లలో కోకో సాగు జరుగుతోందని, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలు కోకో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వర్క్షాప్లో వెల్లడించారు. నాణ్యత పెంపు ద్వారా రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
కోకో సాగు, ప్రాసెసింగ్పై మార్గదర్శకాలకు 79950 87041 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను సంప్రదించాలి
కోకో సాగు, కోకో బీన్స్ నాణ్యతా ప్రమాణాలు, ఫర్మెంటేషన్ మరియు ఎండబెట్టే శాస్త్రీయ పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన తదితర అంశాలపై మరింత సమాచారం పొందాలనుకునే కోకో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్పీఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. దుర్గేష్ను మొబైల్ నంబర్ +91 79950 87041 ద్వారా సంప్రదించి అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు, శిక్షణ కార్యక్రమాల వివరాలు, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యశాల లో ఉద్యానవన శాఖ డైరెక్టర్, ఏపీఎఫ్పీఎస్ సీఈఓ గెడ్డం శేఖర్ బాబు, కోకోశాల వ్యవస్థాపకుడు నితిన్ చోర్డియా, తూర్పు గోదావరి జిల్లా ఏపీఎఫ్పీఎస్ ఈడీ ఏ దుర్గేష్, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు. సుధ, ఐదు జిల్లాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, కోకో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు, కోకో రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News