రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల ఆధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు గారి ఆదేశాల మేరకు, కళాశాలలో చదువుతున్న రెండవ మరియు మూడవ సంవత్సరం వైద్య విద్యార్థులు ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం (జూన్ 19) గోడపత్రిక (పోస్టర్) ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2026 సంవత్సరానికి ప్రకటించిన నినాదం “Closing the Survival Gap: Equity in Sickle Cell Disease” — “సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల జీవన అసమానతలను తగ్గిస్తూ ఆరోగ్య సమానత్వాన్ని సాధించడం” — అనే అంశాన్ని ప్రతిబింబించే విధంగా విద్యార్థులు పోస్టర్లను రూపొందించి ప్రదర్శించారు.
కార్యక్రమ ప్రారంభోత్సవంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ప్రతి వైద్య విద్యార్థి సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది నినాదంలో “Equity” అనే అంశం అత్యంత ప్రాధాన్యమైనదని, ప్రతి వ్యక్తికి వారి అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించడమే ఆరోగ్య సమానత్వం యొక్క ప్రధాన లక్ష్యమని వివరించారు.
సికిల్ సెల్ అనీమియా వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన వైద్యం, కౌన్సెలింగ్ అందించవచ్చని తెలిపారు. ఈ వ్యాధి వారసత్వంగా సంక్రమించే జన్యుపరమైన వ్యాధి కావడంతో వివాహానికి ముందు స్క్రీనింగ్ నిర్వహించడం అవసరమని, అలాగే జన్యు సలహాలు (Genetic Counselling) అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్తో పాటు పాథాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ మరియు ఫోరెన్సిక్ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ, సికిల్ సెల్ అనీమియా నియంత్రణలో స్క్రీనింగ్ అత్యంత కీలకమని వివరించారు.
కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకేతర సిబ్బంది, వైద్య విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News