అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, గౌరవ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మొత్తం 23 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రివర్యులకు సమర్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని మంత్రి శ్రద్ధగా ఆలకించి, వాటిని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా నిరంతరం చర్చలు కొనసాగిస్తామని, ఉద్యోగుల సంక్షేమం మరియు సమర్థవంతమైన పరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News