Breaking News

మార్పుకి ‘జై కొట్టు’… పోరాడే సేన కోసం ‘జై కొట్టు’

-జనసేన పార్టీకి యువతే బలం
-పార్టీ ప్రయాణంలో వారి పాత్రే కీలకం
-యువత సూచనలు, సలహాలు, ప్రతిభను జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పరిశీలిస్తారు
-జై కొట్టు యువజన విభాగం యువత ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది
-స్థానిక సంస్థల్లోనూ యువత, మహిళలకు ప్రాధాన్యం
-జనసేన యువజన విభాగం జై కొట్టు ఆవిష్కరణ సమావేశంలో ప్రసంగించిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
-పండుగ వాతావరణంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ
-ఫోన్ ద్వారా ప్రత్యేక సందేశం ఇచ్చిన పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘ జై కొట్టు.. దేహీ అని దేబురించే చేతులు మాకొద్దు…
దేహీ అని దేబురించే చేతులు మాకొద్దు…
దేశం కోసం యుద్ధం చేసే పిడికిళ్లు కావాలి
నేనెక్కడున్నానో అనే ప్రశ్నార్థకపు చేతులు మాకొద్దు
నేనిక్కడే ఉంటాననే అస్థిత్వం చాటే పిడికిళ్లు కావాలి
ఇన్నాళ్లు నాయకుల కోసం, పార్టీల కోసం, ఓట్ల కోసం జిందాబాద్ లు కొట్టాం చాలు…
ఇక యువత కోసం, వారి భవిత కోసం జై కొట్టు
మార్పు కోసం.. అది తెచ్చే తీర్పు కోసం జై కొట్టు
పట్టువదలని జనం కోసం… పోరాడే సేన కోసం జై కొట్టు ’’
అంటూ ప్రస్తుతం కేరళంలో భుజానికి సంబంధించి వైద్యం చేయించుకొంటున్న జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆడియో సందేశం అందించారు. ఆ సందేశంతో నూతన ఉత్తేజం నింపుకొని జనసేన పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ పిఠాపురంలో ఆవిష్క్రతమైంది. పిఠాపురంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టును ఆవిష్కరణ చేశారు. అంతకు ముందుగా పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా అందించిన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా జనసేనాని జన్మదినోత్సవాల్లో, యువజన విభాగం ఆవిష్కరణలో పాలు పంచుకున్న జనసేన పార్టీ శ్రేణులకు వినిపించారు. అనంతరం జై కొట్టు ప్రత్యేక లోగోను విడుదల చేశారు. పార్టీ పుష్కరకాల ప్రస్థానంలో సాగించిన విజయాలు, పోరాటాల ఏవీలను, గీతాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ కేక్ ను కట్ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎప్పుడూ యువత గురించి, వారి భవిష్యత్తు గురించే ఉంటాయి. యువత ఆశయాలు, ఆకాంక్షల నుంచే జనసేన పార్టీ పుట్టింది. ప్రతి ఉద్యమం, పోరాటంలో, ప్రతి పిలుపులో, గెలుపులో జనసేనకు యువత తోడుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, ఆయన భావజాలాన్ని అర్ధం చేసుకోవడంలో యువతరం ముందుంటుంది. అందుకే  పవన్ కళ్యాణ్ ప్రతిసారీ మీకు నాకు ఒక గుండె మాత్రమే దూరం అని చెబుతుంటారు. పార్టీ కోసం నిస్వార్థంగా నిలబడింది యువతరమే. రాజకీయాల్లో అనుభవంతోపాటు చిత్తశుద్ధి, నమ్మకం అనేది చాలా అవసరం. యువత రాజకీయాల వైపు అడుగులు వేయాలి. ఓ అద్భుతమైన దేశాన్ని తీర్చిదిద్దాలంటే, భవిష్యత్తును అందంగా ఊహించాలంటే అది యువత వల్లనే సాధ్యం. మంచి పని చేయాలనే ఆలోచన, సమాజానికి ఏదైనా చేయాలనే తపన మనలో ఉంటే దాన్ని అణచి వేయొద్దు. దాన్ని క్రమపద్ధతిలో పెట్టి, సమాజానికి సేవ చేసేలా మారండి.
25 ఏళ్ల భవిష్యత్తు పార్టీ నినాదం అయింది
యువత ఆలోచనలను పవన్ కళ్యాణ్ లోతుగా అర్థం చేసుకుంటారు. వారి ప్రతిభను ఆసాంతం పరికిస్తారు. దాని గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. యువత సూచనలను లోతుగా పరిశీలిస్తారు. 2018లో తిత్లీ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన సందర్భంగా 10 రోజులపాటు ఆ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధ్యక్షుల వారితో నేను పర్యటన చేశాను. ప్రతిరోజూ ఓ నిర్దేశిత గ్రామం, ప్రాంతాలు తిరిగి అక్కడున్న స్థానిక యువతతో రోడ్ల పక్కనే మాట్లాడిన రోజులున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం వరద బాధితుడైన యువకుడు ‘మాకు 25 కేజీల బియ్యం కాదు… 25 ఏళ్ల భవిష్యత్తు ’ కావాలి అని పవన్ కళ్యాణ్ కి చెప్పిన మాటనే ఆయన పార్టీ నినాదంగా తీసుకున్నారు. యువత మాటలు, వారి ఆవేదన పవన్ కళ్యాణ్ కి బలంగా తాకుతాయి. నల్లమల యూరినేయం తవ్వకాలపై ఓ యువకుడు పార్టీ కార్యాలయం ముందు ఉంటే సమస్యను మొత్తం విని, అధికారంలో లేకపోయినా అఖిలపక్షం ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించే వరకు ఆయన నిద్రపోలేదు. ఇలాంటివి బోలెడున్నాయి. పార్టీ కోసం శ్రమించే యువత, దేశం కోసం తపించే యువత అంటే పవన్ కళ్యాణ్ కి ప్రేమ.
నియంతలాంటి జగన్ ను ఎదుర్కొన్నాం
2019 తర్వాత- జనసేన పార్టీ మీద అప్పటి వైసీపీ నాయకుడు చేసిన దాడి, సాగించిన దమనకాండను యువతే అడ్డుగా నిలబడింది. జనసేన పార్టీ రాష్ట్రానికి, దేశానికి ఎంత అవసరమో గుర్తించి యువతరం పార్టీని బతికించుకునేందుకు పోరాడింది. నియంతలాంటి వ్యక్తి, తాను చెప్పింది జరగాలి అనుకునే జగన్ లాంటి పాలకుడికి అడ్డుగా నిలబడి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నాం. 2026 నాటికి జనసేన క్రియాశీలక విభాగం సభ్యులు 21.52 లక్షలకు చేరారు. వీరిలో యువతే అధికం. జనసేనకు యువతే ఇంధనం. వారే బలం. కరోనా సమయంలో కానీ ఇతరత్ర సమయాల్లో కానీ ప్రజలకు సహాయం కావాలి అనుకుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ యువతే గుర్తుకొస్తారు. ఇది యువత నిస్వార్థంతో చేసే సేవాగుణం. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా, ఏకగ్రీవాల కోసం చేసిన ప్రయత్నాలను జనసేనాని పిలుపుతో అడ్డుకున్నది జనసేన యువ తరంగాలే. పార్టీ చేపట్టే ఏ కార్యక్రమంలో అయినా వారు చూపించే శ్రద్ధ, తెగువ, పోరాటం అసమానం. రోడ్ల సమస్య గురించి జనసేన క్యాంపెయిన్ పెట్టినపుడు, తరంగం కార్యక్రమంలో ప్రతి ఇంటికి పార్టీని తీసుకెళ్లినపుడు, ధవళేశ్వరం కవాతుతో నిబ్బరంగా పాల్గొన్నది… జెండా పట్టుకొని ధైర్యంగా ముందుడుగు వేసింది యువతరమే.
2017లో ఆయన నాకు చెప్పింది ఇదే..
2017లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో నాకు సుదీర్ఘ సమావేశాలు జరిగినపుడు ఆయన చెప్పింది ఒకటే. మనం అధికారంలోకి వచ్చినా, రాకున్నా నిబద్ధత గల యువతరాన్ని దేశానికి అందజేయాలి. యువ నాయకత్వాన్ని, మార్పును తీసుకొచ్చే సమూహాన్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పేవారు. దీని కోసం ఓ ప్రత్యేకమైన వేదికను తయారు చేయాలని భావించేవారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇటీవల దరఖాస్తుల స్వీకరణ చేసినపుడు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన తర్వాత అధ్యక్షుల వారు కచ్చితంగా యువత ఆలోచనలకు వేదికగా, వారి ఆకాంక్షలను ప్రతిబింబించేలా వేదికను జై కొట్టు రూపంలో నేడు తీసుకొచ్చారు. ఈ యువజన విభాగం కేవలం ఓట్లు, రాజకీయాల కోసం మాత్రమే పని చేయదు. ఇది యువత ఆలోచనలకు, లక్ష్యాలకు, ఆశలకు, వారధిగా నిలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు యువత, మహిళలకు జనసేన పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది. ఇక నుంచి మన మాతృభూమికి జై కొడదాం… రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపే కూటమి పాలనకు జై కొడదాం… పవన్ కళ్యాణ్ ఆశయాలకు జై కొడదాం… జనసేన పార్టీకి జై కొడదాం… భరత మాతకు జై కొడదాం’’ అన్నారు.
ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ అధ్యక్షులు, కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, కాకినాడ అర్భన్ డవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *