-ప్రభుత్వ వైద్యాధికారుల ద్వారా మెడికల్ స్క్రీనింగ్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హజ్-2027 యాత్రకు తాత్కాలికంగా ఎంపికైన యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ స్క్రీనింగ్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాష సూచించారు. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యాన్ కు లిఖితపూర్వకంగా వినతి పత్రం అంద చేసినట్లు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన 2026 సెప్టెంబర్ 1 తేదీ సర్క్యులర్ నంబర్ 10 ప్రకారం తాత్కాలికంగా ఎంపికైన ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా నిర్దేశిత మెడికల్ స్క్రీనింగ్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందన్నారు. ఈ సర్టిఫికెట్ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రక్షణ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల ఆధ్వర్యంలో అధికారికంగా అనుమతించబడిన ప్రభుత్వ అల్లోపతి వైద్యాధికారి ద్వారా పొందాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తాత్కాలికంగా ఎంపికైన నేపథ్యంలో, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, నిర్దేశిత నమూనాలో మెడికల్ స్క్రీనింగ్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేలా అన్ని జిల్లాల జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన గడువులోగా వైద్య పరీక్షలు పూర్తి చేసి, సర్టిఫికెట్లను పొందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సర్టిఫికెట్లను తదుపరి హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకు సమర్పించేందుకు, ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వీలు కల్పించనున్నామని ఆయన చెప్పారు.
హజ్ యాత్రికులు ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోగా వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో హజ్ యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వారి ఆదేశాల మేరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందించాలని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News