విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సెంట్రల్ నియోజకవర్గంలో సింగ్ నగర్, కృష్ణ హోటల్ సెంటర్ లో మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి డా వైయస్ రాజేశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైయస్ ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు, చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి అనంతరం అన్నదానం, తదితర కార్యక్రమాలు ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పలు చోట్ల వై ఎస్ ఆర్ 17వ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు.’సంక్షేమం అంటే వైఎస్సార్ వైఎస్సార్ అంటే సంక్షేమం’ అనే స్థాయిలో పాలన సాగిందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద పోలవరం, పులిచింతల, వెలుగోడు, హంద్రీ-నీవా వంటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి రైతాంగాన్ని ఆదుకున్న మహనీయుడు ఆయనేనని గుర్తుచేశారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞాన్ని ‘ధనయజ్ఞం’ అని చంద్రబాబు ఎగతాళి చేశారని, ఉచిత కరెంట్పై హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులు ఫలాలు ఇస్తుంటే, తానే చెట్లు నాటినట్లు చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ బాటలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అట్టడుగుకు పడిపోయిందని, అభివృద్ధి కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఆరోపించారు.రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ నాటి సంక్షేమం, అభివృద్ధి జరగాలన్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సంక్షేమ పాలన పునరావృతం కావాలంటే వైఎస్ జగన్తోనే సాధ్యం అని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనలోనే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పథకాలను అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News