-టీటీడీ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరాల నిర్వహణ
-ఎన్టీఆర్, హరికృష్ణ లకు నివాళులర్పించి పుష్పాంజలి ఘటించిన నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చైతన్యరథ సారథి, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులోని నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వైద్య, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తో పాటు కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, సూరపనేని హనుమంతరావు, డాక్టర్ సోమశేఖర్, చిన్నపాటి గాంధీ, గొట్టిపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ హరికృష్ణ ప్రజల మధ్య తిరిగిన నాయకుడని, ఆయన పర్యటనలకు అపూర్వ ప్రజాదరణ లభించేదని గుర్తు చేశారు. 1995లో విద్యార్థిగా ఉన్న సమయంలో హరికృష్ణ పర్యటనను ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, విజయవాడ నుంచి గుడివాడ మీదుగా సాగిన ఆ యాత్రకు ప్రజలు గంటల తరబడి స్వాగతం పలికిన దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయని చెప్పారు. రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్ పన్ను రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. గోదావరి వరదల సమయంలో జోలె పట్టి విరాళాలు సేకరిస్తూ బాధితుల కోసం కృషి చేసిన సేవాస్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. డ్రైవింగ్పై ఆయనకు ఉన్న మక్కువ, ప్రజలతో కలిసిమెలిసి ఉండే స్వభావం ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని అన్నారు. హరికృష్ణ సొంత గ్రామంలో ఆయన జయంతిని పురస్కరించుకుని రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News