Breaking News

కాపు, ఎస్సీ, ఎస్టీ, శెట్టిబలిజలు జనసేన వైపే…

-కోనసీమ అల్లర్లు యాదృచ్చికం కాదు.. వైసీపీ మాస్టర్ ప్లాన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోనసీమ అల్లర్లు యాదృచ్చికంగా జరిగినవి కాదని, రాజకీయ లబ్ది కోసం వైసీపీ గీసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగా జరిగినవేనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి  పెదపూడి విజయ్ కుమార్ ఆరోపించారు. కోనసీమలో ఏర్పడిన ప్రత్యేక రాజకీయ పరిస్థితులతో వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. కాపు, శెట్టిబలిజలతో పాటు ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఒక రాజకీయ సమూహంగా జనసేన వైపు మొగ్గుచూపడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. వైసీపీ పునాదులు కదులుతున్న నేపధ్యంలోనే ఈ అరాచకపు క్రీడకు నాంది పలికిందన్నారు. ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో అన్నదమ్ముల్లా ఉండే కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీ నాయకులు పన్నిన కుట్రను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.  జగన్ రెడ్డి రాజకీయలబ్ది కోసం ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టించారనీ, వారి రాజకీయాల కోసం ఎస్సీలు, బీసీలనే బలిచేశారని మండిపడ్డారు. ఘటనపై ఇంత వరకు ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేకపోవడం ప్రభుత్వం దీన్ని ఎంత తేలిగ్గా తీసుకుందన్న విషయం అర్ధమవుతోందన్నారు. ఆదివారం విజయవాడలో పార్టీ అధికార ప్రతినిధులు పోతిన వెంకట మహేష్, డాక్టర్ గౌతంరాజ్, విజయ్ శేఖర్ లతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ..

రాష్ట్రంలో దళితులు వైసీపీ నుంచి రోజు రోజుకీ దూరమవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో దళితుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తాం.. గొప్పగా పరిపాలిస్తాం.. సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించారు. దళితుల్ని దగా చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం మీద నమ్మకం పోయేలా చేశాయి. కోనసీమ ప్రాంతంలో నివసిస్తున్న దళితులకు ఆది నుంచి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. అంతా చదువుకుని ఒక నిర్ధిష్టమైన ఆలోచనా విధానంతో మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులు చక్కగా అర్ధం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. శ్రీ జగన్ రెడ్డి చేసిన కుట్రల్ని వారంతా అర్ధం చేసుకున్నారు. వైసీపీకి, జగన్ రెడ్డికి వారంతా దూరంగా జరుగుతున్న పరిస్థితుల్లో కులాల మధ్య చిచ్చుపెట్టి వారిని విచ్చిన్నం చేయాలన్న ఆలోచనతో కోనసీమ ప్రాంతంలో అల్లర్లు సృష్టించారు.

జగన్ రెడ్డి పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద హత్యాచారాలు, దాడులు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. డాక్టర్ సుధాకర్ ఉదంతం నుంచి చీరాల ఎడిచర్ల కిరణ్ హత్య కేసు, సీతానగరం శిరోముండనం కేసు, గుంటూరు రమ్య హత్య కేసు, రేపల్లి దళిత మహిళ సామూహిక అత్యాచారం, కొద్ది రోజుల క్రితం సాక్ష్యాత్తు వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు ఒక దళిత యువకుడ్ని హత్య చేసి తన కారులోనే వేసుకుని తల్లిదండ్రులకు అప్పచెప్పిన పరిస్థితి. ఇలాంటి భయాందోళనకరమైన పరిస్థితుల్లో జగన్ రెడ్డి వల్ల దళితులకు ఒరిగిందేమీ లేకపోగా వారి కుట్ర, మోసాలకు బలి చేస్తున్నారని అర్ధం అయ్యింది. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారన్న విషయం దళిత యువత తెలుసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం కోసం ఉన్న అనేక పథకాల్ని నాశనం చేసింది. విద్యోన్నతి పథకం, విదేశీ విద్యోన్నతి పథకం, బెస్ట్ ఎవాలిబుల్ స్కీమ్ పథకం, ల్యాండ్ పర్చేజింగ్ పథకం, ఇళ్ల పట్టాలు ఆశ చూపి ఎస్సీ, ఎస్టీల ఆదీనంలో ఉన్న అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడింది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉండే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉన్న స్కీములను మెమో నంబర్ 1-2,1-3 ద్వారా రద్దు చేయడం జరిగింది. వైసీపీ మోసపూరిత వైఖరి దళిత యువతకు అర్ధం అవుతోంది.

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన ఎదిగింది
ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అన్ని వెనుకబడిన వర్గాలు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో వారంతా జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. కోనసీమలో ఈ కులాలన్నీ జనసేన పార్టీ వైపు చూస్తుండడంతో జగన్ రెడ్డికి ఈర్ష్య మొదలైంది. ఎలాగైనా అక్కడ విధ్వంసం సృష్టించి, కులాల మధ్య చిచ్చు పెడితే వారు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ కలవకుండా ఉండేలా చేస్తేనే జనసేన బలహీనపడుతుందన్న కుట్ర పూరిత వైఖరితోనే కోనసీమ ప్రాంతంలో అల్లర్లు సృష్టించారు.

సజ్జల స్క్రిప్ట్ నే హోంమంత్రి చదువుతున్నారు
వైసీపీ నాయకులు అమాయకులైన శెట్టిబలిజ కులాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకర రీతిలో, సమాజం సిగ్గుపడే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాగి ఉన్నారనీ, గంజాయి మత్తులో ఉన్నారని అంటూ వారు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఈ వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ వ్యాఖ్యల లక్ష్యం కూడా శెట్టిబలిజలు, ఎస్పీల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టాలి. ఆ రెండు కులాలు కలవకూడదు. ఒక రాజకీయ శక్తిగా ఎదగకూడదు అన్నదే. మీ కుట్రలు తెలుసుకోలేకపోవానికి ప్రజలు అమాయకులా? అల్లర్లు జరిగిన వెంటనే హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. జనసేన నాయకులు అల్లర్లు సృష్టించారని చెబుతున్నారు. ఇంతకీ పోలీస్ వ్యవస్థ గానీ, నిఘా వ్యవస్థ గాని జనసేన పార్టీ చేతుల్లో ఉన్నాయా? హోంమంత్రికి కనీస అవగాహన ఉండాలిగా? నిరసనకారులు మంత్రి ఇల్లు తగులబెట్టడానికి వెళ్తే పోలీసులు నియంత్రించలేరా? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంతబలహీనంగా ఉందా? ఆ సంఘటన జరగడానికి ముందు రోజు కోనసీమ సాధన సమితి పేరుతో 500 మంది సమావేశం ఏర్పాటు చేస్తే నిఘా వర్గాలకు సమాచారం లేదా? ఎవరి చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని హోంమంత్రి మీడియా ముందు చదువుతారు. ఆమెకు పోలీస్ వ్యవస్థ మీద ఏ మాత్రం పట్టు ఉండదు. జనసేన పార్టీని తిడితే ముఖ్యమంత్రి మిమ్మల్ని మెచ్చుకుంటారు నిందలు వేసేస్తారు.

గొడవను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది
కులాల్ని కలిపే ఆలోచనా విధానం జనసేన ప్రధాన సిద్ధాంతం. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య ఆరోగ్యకమైన వాతావరణంతో పవన్ కళ్యాణ్ నికార్సయిన రాజకీయాలు చేస్తున్నారు. కోనసీమ ప్రాంతంలలో ప్రజలంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో నివసించాలని జనసేన పార్టీ కోరుకుంటోంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు గుండెల నిండా నింపుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. దళిత యువత కోసం ఒక నిబద్దతతో కూడిన ప్రణాళిక ఉన్న ఏకైక నాయకుడు ఆయన. అన్నిజిల్లాలతో పాటు కోనసీమకు బాబాసాహెబ్ పేరు పెట్టవచ్చు కదా? ఇప్పుడే ఎందుకు పెట్టారు. ఇదంతా వైసీపీ మాస్టర్ ప్లాన్ లో భాగం. కులాల మధ్య అలజడి సృష్టించాలి. కులాలు కలసి ఉండకూడదు. రాష్ట్రంలో ఏ రెండు కులాలు కలిసినా వైసీపీ పీఠాలు కదిలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహనీయుని పేరుని వివాదాలకు కేంద్రంగా వాడుకునే పరిస్థితుల్ని మాత్రమే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఇంత గొడవ జరుగుతుంటే ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకుంది. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు గొడవ జరిగిన ప్రాంతాన్ని సందర్శించలేదు. అల్లర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసుల్ని పంపారు. ఇంటర్నెట్ సిగ్నల్స్ ఆపేశారు.. ఎవ్వరూ వారి స్పందన, అభిప్రాయాలు తెలియచేయడానికి వీల్లేని పరిస్థితులు కల్పించారు. ఒక అరాచకమైన, అన్యాయమైన, దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో నడుస్తోంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, అరాచకాలు సృష్టించినా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కీ ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో నానాటికీ పెరుగుతున్న ఆదరణ తగ్గించలేరు. మీరు ఇంటికి పోయే సమయం ఆసన్నమైంది. కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని కుంపటి చేయొద్దు. ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. నేరాలు, ఘోరాలు చేసి విధ్వంసాలు సృష్టించి వాటిని జనసేనకు ఆపాదించే ప్రతయ్నం చేస్తే చూస్తూ ఊరికునేది లేదు. ప్రజాక్షేత్రంలో మీకు బుద్ది చెబుతాం.

జనసేన పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా వద్దని ఎక్కడా చెప్పలేదు. మా పార్టీ నాయకులు ఆ పేరు కోసం నిరసన దీక్షలు కూడా చేశారు. ఉద్రిక్తతల నేపధ్యంలో సున్నితమైన అంశాన్ని ప్రజల మధ్య సానుకూల పరిస్థితులు కల్పించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి గుర్తు చేశారని అన్నారు.

సీఎం, డీజీపీ ఎందుకు స్పందించలేదు –  పోతిన వెంకట మహేష్
పార్టీ అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. కోనసీమ అల్లర్ల ఘటన మీద దామోస్ పర్యటనలో ఉన్న  జగన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు. ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా వీడియో సందేశం పంపితే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడగలిగే వారు. నియంత్రించగలిగే వారు. జగన్ రెడ్డి ఆ ప్రయత్నం చేయకపోవడాన్ని ఆ పార్టీ కుట్రగానే భావిస్తున్నాం. కోనసీమలో అల్లర్లు సృష్టించి తద్వారా ఆ ప్రాంతంలో కులాల మధ్య చిచ్చు పెట్టి అత్యధిక సీట్లు సాధించాలన్న రాజకీయ కుట్ర దాగి ఉండబట్టే ముఖ్యమంత్రి స్పందించలేదు. ఇంతపెద్ద ఘటన జరిగితే కనీసం డీజీపీ కూడా స్పందించలేదు. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పలేదు. ఈ ఘటన మొత్తానికి సూత్రదారులు, పాత్రదారులు జగన్ రెడ్డి,  సజ్జల, వైసీపీ నాయకులు, కార్యకర్తలే. కులాల మధ్య చిచ్చుపెట్టి ఎంత కాలం రాజకీయ లబ్ది పొందుతారు? వైసీపీ కుట్రల్ని ప్రజలు గ్రహించాలి. మొదట మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. అమరావతి రాజధాని పేరిట కులాల మధ్య చిచ్చుపెట్టారు. దానికి కొనసాగింపే కోనసీమ ఘటన.  జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించకుంటే ప్రజాస్వామ్య వాదులంతా తిరగబడతారు. మీకు చిత్తశుద్ది ఉంటే సామాజిక న్యాయభేరి యాత్రను అమలాపురం ఎందుకు మళ్లించలేదు. ఉద్రికత్తతలు తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయలేదు. పదే పదే తిరుమల వెళ్లి అక్కడ రాజకీయాలు మాట్లాడుతూ క్షేత్ర పవిత్రతను అపవిత్రం చేస్తున్న మంత్రి రోజా హిందువులకు క్షమాపణలు చెప్పాలి

దావోస్ పర్యటన జగన్ రెడ్డి కుటుంబ పర్యటన
ముఖ్యమంత్రి దావోస్ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టింది కాదు. అది జగన్ రెడ్డి కుటుంబ పర్యటన. అందుకే ఆయన సతీసమేతంగా వెళ్లారు. గతంలో సతీసమేతంగా ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చారా? జగన్ రెడ్డి కుటుంబ వ్యాపార విస్తరణకు ఉపయోగించుకుంటున్న టూర్ ఇది. సండూర్ పవర్స్, భారతీ సిమెంట్స్ వ్యాపార విస్థరణకే దావోస్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తేవడానికి ఏ మాత్రం కాదు. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతే ఆపలేని ముఖ్యమంత్రి దావోస్ నుంచి పెట్టుబడులు తెస్తామంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు

కోనసీమ అల్లర్లపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలి- డాక్టర్ పాకనాటి గౌతంరాజ్
మరో అధికార ప్రతినిధి శ్రీ పాకనాటి గౌతంరాజ్ మాట్లాడుతూ.. కోనసీమ అల్లర్ల కుట్రకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే బీజం పడింది.  పవన్ కళ్యాణ్  వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనడంతో అధికారానికి దూరమవ్వాల్సి వస్తుందన్న భయంతోనే ఇలాంటి కుట్ర పన్నారు. సీబీఐ కోర్టులు, కార్యాలయాల్లో కూర్చున్నప్పుడు పాత కేసు ఫైల్స్ బాగా చదివి నెత్తికి ఎక్కించుకుని దాన్ని కోనసీమ జిల్లాల్లో అమలు పరిచారు. అల్లర్లు సృష్టించి దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వాడుకునే స్థాయి నీచమైన రాజకీయం వైసీపీ మాత్రమే చేసింది. అసలు కోనసీమలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టేందుకు వైసీపీ అనుకూలమా? వ్యతిరేకమా? దీనిపై ముందుగా వైసీపీ స్పష్టత ఇవ్వాలి. విధ్వేషాలు రేపింది కోనసీమ సాధన సమితిలో ఉన్న వైసీపీ నాయకులే. అల్లర్ల వెనుక జనసేన ఉందని భావిస్తే విచారణ త్వరగా పూర్తి చేయొచ్చుగా. స్థానిక పోలీసుల మీద జనసేనకు నమ్మకం లేదు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ కమిషన్ వేసి విచారణ జరపాలి. స్థానిక పోలీసుల సాయంతో మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే జనసేన చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు.

దళితుల రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం-  బేతపూడి విజయ్ శేఖర్
రాష్ట్ర కార్యదర్శి శ్రీ బేతపూడి విజయ్ శేఖర్ మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల వెనుక ప్రభుత్వ ఉద్దేశ పూర్వక కుట్ర చేసింది. వైసీపీకి సంప్రదాయ బద్దంగా వస్తున్న ఓటు ఈ మూడేళ్ల కాలంలో దూరమైపోయింది. ఉన్న సంక్షేమ పథకాలు రద్దు చేయడం. సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించడంతో యువత  పవన్ కళ్యాణ్ కి దగ్గరవ్వడం మొదలయ్యింది. ఆ భయంతోనే కోనసీమ జిల్లాల్లో విధ్వేషాలు రెచ్చగొట్టి కుటిల రాజకీయ క్రీడకు ఈ ప్రభుత్వం తెరతీసింది. దళితుల రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *