పల్లెపాలెం, నేటి పత్రిక ప్రజావార్త :
సముద్రపు నాచు పెంపకంతో సంపద సృష్టించడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని మత్స్య శాఖ కమిషనర్ డోలా శంకర్ పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం పల్లెపాలెం గ్రామ పరిధిలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పంజరంలో సముద్రపు నాచు పెంపక ప్రదర్శన క్షేత్రమును శనివారం మధ్యాహ్నం మత్స్య శాఖ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్రపు నాచు మొక్కల పెంపకాన్ని గతంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చేపట్టడం జరిగిందని, అయితే కొన్ని సమస్యల వల్ల అది పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో లోపాలను సరిచేసుకుని ఈ ఈ నాచు మొక్కలను పూర్తిస్థాయిలో పెంచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవరోధాలు లేకుండా నాచు మొక్కలను పెంచడానికి ప్రత్యేకంగా వలలతో రూపొందించిన పంజరం (కేజ్ కల్చర్) ఏర్పాటుచేసి అందులో మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. తద్వారా చేపలు, పీతలు వంటి సముద్రపు జీవులు ఆ నాచు మొక్కలను తినకుండా ఉంటాయని, వాటి పెరుగుదల ఆశించిన రీతిలో బాగుంటుందన్నారు. పూర్తిస్థాయిలో పెరిగిన నాచు మొక్కలను ఎండబెట్టి ఔషధాలు, సౌందర్య సాధనాలు, శీతల పానీయాలు వంటి తయారీతో పాటు మేతగా సైతం వీటిని ఉపయోగించడం జరుగుతుందని, దీనికి మార్కెట్లో భారీ మొత్తంలో డిమాండ్ ఉందన్నారు. తమిళనాడులో దీనికి సంబంధించిన పరిశ్రమ ఉందని, ఆ రీతిలో రాష్ట్రంలో సైతం దీనిని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు త్వరలో ముత్యాలు, ఆల్చిప్పల సాగును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యసాధనలో వృద్ధిరేటు భారీగా పెరుగుతుందన్నారు. ఈ పథకం సఫలీకృతం కావడం ద్వారా భారీగా సంపద సృష్టి జరుగుతుందని, అదేవిధంగా జీవనోపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్శనలో రాష్ట్ర ఆక్వాకల్చర్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ బాషా, ఇన్చార్జి జిల్లా మత్స్యకాధికారి నాగబాబు, మత్స్య అభివృద్ధి అధికారి సత్యనారాయణ, గ్రామ మత్స్య సహాయకులు, సాగర మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News