-ఏలూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.వి. నాగ ప్రభు కుమార్
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాటు సారాయి నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0లో భాగంగా తాడేపల్లిగూడెంలోని దీక్ష డి-అడిక్షన్, డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్లో మద్యం, మత్తు పదార్థాల వ్యసనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ , జిల్లా మేజిస్ట్రేట్ చడలవాడ నాగరాణి ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత మార్గదర్శనంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది.
నాగ ప్రభు కుమార్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యసన విముక్త సమాజ నిర్మాణానికి కృషి చేస్తోందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి (భీమవరం) డాక్టర్ ఆర్.ఎస్. కుమరేశన్ మాట్లాడుతూ, దీక్ష రీహాబిలిటేషన్ సెంటర్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, మత్తుకు బానిసైన వారిని గుర్తించి ఇలాంటి కేంద్రాల్లో చికిత్సకు పంపించాలని సూచించారు. కార్యక్రమానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. కేంద్రానికి అవసరమైన సహకారం అందించాల్సిందిగా స్థానిక ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు.
అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్.వి. ప్రసాద్ రెడ్డి, మాట్లాడుతూ సమాజ హితం కోసం ఇలాంటి సేవా సంస్థలకు అందరూ సహకరించాలని సూచించారు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్య లక్ష్మి మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉచితంగా నిర్వహిస్తున్న దీక్ష కేంద్రం సేవలు ఎంతో మానవీయంగా ఉన్నాయని కొనియాడారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు జి. మురళీమోహన్ రావు, ఆర్. దొరబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News