విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బేడ (బుడ్గ) జంగం కులమును రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ చేసి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వనం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాంధీనగర్ ధర్నాచౌక్లో నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం నుండి (1950 సం) ఎస్సీ జాబితాలో కొనసాగుతూ సమాజానికి ప్రకృతి వైద్యం, కళారూపాలతో ప్రజలందరికీ సేవలందిస్తున్నా అంటరానితనానికి గురి అవుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మా జాతిలో ఒకరు ఇద్దరు మాత్రమే పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బేడ (బుడ్గ) జంగం ఎస్సీ జాబితాలో లేరని ఫేక్ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎస్సీ రిజర్వేషన్లోకి వచ్చి రిజర్వేషన్లు ఫలాలు అనుభవిస్తున్నారని అభియోగాలు మోపి 2023లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఎస్సీ కుల దృవికరణ పత్రాలు నిలిపివేశారన్నారు. ఇప్పటికీ మా కులాలు అంటరానితనానికి గురవుతూనే వున్నాయని, రాజ్యాంగబద్ధంగా అర్హత కలిగి ఉన్న ఆన్లైన్ ఎస్సీ, కుల ధ్రువీకరణ పత్రం నిలిపివేయడం వలన అన్ని రంగాల్లో ఉద్యోగ నియామకాల్లో మా కులానికి అన్యాయం జరిగిందని వాపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఊభూది సూరయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు, చార్ల కోటయ్య, కళ్యాణి చిన్న కనకయ్య, ముత్యాల ప్రసాదరావు, కప్పెర పెద్ద లింగం, శ్రీనివాస్, సిరిగిరి యామయ్య, గోటూరి చిన్న మరిడయ్య, మల్లిఖార్జునరావు, వెంకటేష్, పేర్ల శీను, పెర్ల రత్నం రాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News