నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ల పధకంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నూజివీడు పట్టణంలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై మునిసిపల్, గృహనిర్మాణం, వార్డ్ సచివాలయాల టెక్నికల్ అసిస్టెంట్స్ తో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా నూజివీడు పట్టణంలో జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నత్తనడకన సాగడంపై అధికారులు, సిబ్బందిపై ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదలకు పక్కా గృహాలు అందించే జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఈ కార్యక్రమంలో అలసత్వం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై తీవ్ర చర్యలుంటాయన్నారు. నూజివీడు పట్టణంలో జగనన్న ఇళ్ల పధకం కింద 2254 ఇళ్లు మంజూరు చేయగా రెండంకెలలో పురోగతి సాధించడంపై అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వారం రోజులలోగా ఇళ్ల నిర్మాణ పనులలో పురోగతి సాధించకపోతే సంబంధిత అధికారులు,సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . జిల్లాలో జగనన్న ఇళ్ల పధకంలో నిర్లక్ష్యం వహించిన గృహ నిర్మాణ శాఖ, తదితర శాఖల అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడిందని, మీరు అటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దన్నారు. వార్డ్ వాలంటీర్లు, సచివాలయ టెక్నికల్ అసిస్టెంట్స్, గృహ నిర్మాణ శాఖ ఏ ,ఈ లు, మునిసిపల్ ఈ ఈ లు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో చర్చించి, వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించడమే కాక, సిమెంట్, స్టీల్ వంటి మెటీరియల్స్ సబ్సిడీ ధరపై లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తున్నదని, ఈ అంశాలను లబ్దిదారులకు తెలియజేసి ఇళ్ళు నిర్మించుకునేలా చైతన్య పరచాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను జగనన్న కాలనీల వద్ద లబ్దిదారులకు అందుబాటు లో ఉంచాలని, సిమెంట్, స్టీల్ వంటివి కొరత లేకుండా గోడౌన్లలో నిల్వ చేసి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారులు ముందుకు వచ్చి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేసారు. సమావేశంలో మునిసిపల్ కమీషనర్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ డీ.ఈ. లక్ష్మి నారాయణ, గృహ నిర్మాణ శాఖ ఏ .ఈ సత్యనారాయణ, పట్టణంలోని వార్డు సచివాలయాలు టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News