నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాదని శాసనసభ్యలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక కోనేరుపేటలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ పేదప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నదన్నారు. ఆర్ధిక వ్యవస్థపై కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో కూడా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 13 వేల 840 కోట్ల రూపాయలు ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులలో అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు దివంగత నేత డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పధకాన్ని ప్రవేశపెట్టారని, గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పధకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడిచి మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఆరోగ్యశ్రీ పధకంలో చేర్చడంతో పాటు డెంగ్యూ, కోవిడ్, బ్లాక్ ఫంగస్ వంటి వాటికి చికిత్సలను కూడా వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పధకం లో చేర్చి మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రజల గుమ్మంవద్దకు ప్రభుత్వ సేవలు అందించేందుకు గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారని, అదే విధంగా పట్టణ , గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు గ్రామ/వార్డ్ సచివాలయాలు పరిధిలో వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్ సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీటితో ఆరోగ్య సమస్యలకు చికిత్సకు సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా నివాసిత ప్రాంతాలకు దగ్గరలోనే వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్ కేంద్రాలలో చికిత్స తీసుకోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితులలో 108, 104 సేవలను ప్రజలు వినియోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ కౌన్సిలర్ సీలం రాము, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, ఈఈ లక్ష్మీనారాయణ, ఏఈ ఏసుపాదం, ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్ డాక్టర్ నరేంద్ర కృష్ణ , మునిసిపల్ కౌన్సిలర్ మౌనిక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News