గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లచెరువులో శుక్రవారం రాత్రి వీధి కుక్కల దాడిలో గాయపడిన ఫణీంద్ర రెడ్డికి మెరుగైన వైద్యం అందేలా జిజీహెచ్ వైద్యులతో సమన్వయం చేసుకుంటూ, తన ఆరోగ్యం కుదుట పడే వరకు జిఎంసి సిఎంఓహెచ్, ఎంహెచ్ఓలు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బాలుడిపై వీధి కుక్కల దాటి ఘటన తెలియగానే తక్షణం స్పందించిన కమిషనర్ ప్రజారోగ్య అధికారులు, జిజిహెచ్ సూపరిండెంట్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నల్ల చెరువులో ఫణీంద్రరెడ్డి అనే బాలుడిపై వీధి కుక్కల దాడి దురదృష్టకరమని, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణలు జిజిహెచ్ లో బాలుడు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని ఆదేశించామన్నారు. జిజిహెచ్ సూపరిండెంట్ తో మాట్లాడి బాలునికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారన్నారు. నల్లచెరువు ప్రాంతంలోని వీధి కుక్కలకి యాంటి ర్యాబీస్ వ్యాక్షినేషన్ చేయించాలని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కి ఇచ్చిన ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇప్పటికే నగరంలోని పొన్నూరు రోడ్ లో యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబీసి) సెంటర్ నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నామని, ఈ నెలాఖరులోపు అందుబాటులోకి తెస్తామన్న తెలిపారు. ఏబీసి సెంటర్ అందుబాటులోకి రాగానే వార్డ్ ల వారీగా వీధి కుక్కలకి యాంటి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ లు చేయడానికి ఏజన్సీని కూడా సిద్ధం చేసినట్లు, సదరు స్నేహ ఏజన్సీకి యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి ఏబీసి నిర్వహణకు అనుమతులు జారీ అయ్యాయని, వాటి మేరకు జిఎంసి నుండి వర్క్ ఆర్డర్ కూడా స్నేహ ఏజన్సీకు మంజూరు చేశామన్నారు. ఏజన్సీ ప్రతినిధులతో శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి రోజు 100 వీధి కుక్కలకు ఏబీసి చేసే లక్ష్యంతో తగిన డాక్టర్లు, సిబ్బందిని సిద్దం చేసుకోవాలని ఆదేశించామని తెలిపారు. సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ల ఆదేశాల మేరకు వీధి కుక్కలకు ఏఆర్వీ వ్యాక్సినేషన్, ఏబీసి చేసి, ఎక్కడ పట్టుకుంటే అదే ప్రాంతంలోనే వదలడం జరుగుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News