-లస్కర్ల సేవలను సమర్ధంగా వినియోగించుకుందాం.
-మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నీటిపారుదల రంగ సమర్థ నిర్వహణకు లస్కర్ల వ్యవస్థ చాలా కీలకమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శాసనమండలిలో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7224 మంది లస్కర్ల కు గానూ, 1517 మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. లస్కర్ల పదవీ విరమణ అనంతరం ఆ పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే లస్కర్ల వ్యవస్థ ప్రాధాన్యాన్ని గుర్తించి తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.
2025-26 ఏడాదికి ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలనే లక్ష్యంతో 1033 మంది లస్కర్లను ఔట్సోర్సింగ్ లో తీసుకున్నామని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వం లస్కర్ల భర్తీ మాట అటుంచి వాళ్ళ జీతాలు బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. ఆ బకాయిలు 9.16 కోట్లను, కూటమి ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. లస్కర్ల రోజు వారీ జీతం రూ.350 నుండి రూ. 550 లకు నేడు కూటమి ప్రభుత్వం పెంచిన విషయం సభ దృష్టికి తీసుకువచ్చారు.
గతం లో నీటి తీరువా పన్ను వసూలు చేస్తేనే లస్కర్ల జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది అన్నారు. కానీ నేడు బడ్జెట్ లో లస్కర్ల జీతాల కొరకు నిధులు కేటాయించామన్నారు. లస్కర్ల వ్యవస్థను చక్కదిద్దడంతో పాటు లాకులు షట్టర్లు మరమ్మతులు కూడా చేయడం వల్ల ఫలితాలు బాగుంటాయని చైర్మన్ స్థానంలో ఉన్న మోషేన్ రాజు సూచించగా. మీ సూచన కూడా పాటిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఓ అండ్ ఎం పనుల నిమిత్తం 200 కోట్లు కూడా ఖర్చు చేయ లేదన్నారు. అందువలనే ఎక్కడికి అక్కడ షట్టర్లు లాకులు తుప్పు పట్టిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం లోనే ఓ ఓ అండ్ ఎం పనుల కోసం780 కోట్లు మంజూరు చేసామని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News