– సృజనాత్మకతే మహిళల సుస్థిర ఉపాధికి బాట
–ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హస్తకళా రంగం మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా నిలుస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. సంప్రదాయ నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని రూపొందించే హస్తకళా ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
శనివారం విజయవాడ రూరల్, గొల్లపూడి డీఆర్డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు హస్తకళా ఉత్పత్తులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పరిశీలించారు. మహిళలతో మాట్లాడి శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాబ్రిక్, టోట్, గ్లాస్ పెయింటింగ్, తాంజోర్ పెయింటింగ్స్పై వర్క్షాప్ నిర్వహించగా.. దాదాపు 140 మంది ఔత్సాహిక మహిళలు ఈ వర్క్షాప్నకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మహిళలు తమ సృజనాత్మకతను ఉపయోగించుకుని హస్తకళల ద్వారా స్థిరమైన ఆదాయం పొందగలరని, ఇది సుస్థిర ఉపాధికి మంచి మార్గమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆసక్తి గల మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో వివిధ ఉత్పత్తుల తయారీ పద్ధతులు, నూతన డిజైన్లు, నాణ్యత ప్రమాణాలు, అలాగే మార్కెటింగ్ విధానాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు. శిక్షణ అనంతరం మహిళలు తమ ఉత్పత్తులను స్వయం ఉపాధిగా అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
Prajavartha Online Telugu News