-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మహిళా సాధికారతపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరేదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
శనివారం మంత్రి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కి ఆలయ ఈవో వీకే శీనా నాయక్ స్వాగతం పలకగా ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి ప్రత్యేక పూజలు అనంతరం ప్రసాదం అందజేశారు.
అనంతరం మంత్రి కొలుసు పార్ధ సారథి మీడియాతో మాట్లాడుతూ… తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సాధికారత దిశగా మహిళా బిల్లు కీలకమని, అది ఆమోదం పొందుతుందని ఆశించామని చెప్పారు. ఆ బిల్లు ఆమోదం పొందితే తన పుట్టినరోజు మరింత ఆనందంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
అయితే కూటమి నాయకత్వంలో ఆ బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు అడ్డంకులు కలగడం సమంజసం కాదని అన్నారు.
మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల అభివృద్ధి, సాధికారతకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News