గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యత అత్యంత ప్రధానమని, నాణ్యత ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ రోడ్, చుట్టగుంట సెంటర్, కోదండరామయ్య నగర్, జిటి రోడ్, శాంతి నగర్, శ్రీనివాసరావుతోట, నల్లచెరువుల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పెండింగ్ సమస్యలను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అభివృద్ధి పనుల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వివిధ విభాగాల మధ్య సరైన సమన్వయం ఉంటేనే పనులు వేగంగా మరియు సమర్థవంతంగా పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. నిర్మాణ సామాగ్రి రోడ్ల పై రాకపోకలకు అడ్డుగా ఉంచవద్దన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, స్తంభాలు షిఫ్ట్ చేయాల్సిన ప్రాంతాల్లో షిఫ్టింగ్ కు అంచనాలు సిద్దం చేయాలన్నారు. ప్రారంభించిన పనులు పెండింగ్ ఉండడానికి వీలు లేదని, ఈఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రధానంగా వర్షాకాలం సమస్య తలెత్తకుండా కల్వర్ట్ లు, డ్రైన్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తీ చేయాలన్నారు. పారిశుధ్య పనుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, అపరిశుభ్రంగా ఉండి, వ్యర్థాలతో నిండిన ఖాళీ స్థలాల పట్ల కఠినంగా ఉండాలని, అటువంటి ప్రాంతాల్లో తక్షణమే జిఎంసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి యజమానులను జవాబుదారీ చేయాలని సూచించారు. వీటితో పాటు, నగరంలో మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ కళ్యాణరావు, డిఈఈలు వెంకటరమణ, శ్రీనివాస్, ఎస్ఎస్ సాంబయ్య, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News