– ప్రక్రియలో పారదర్శకత, సమయం ఆదాకు వీలు
– స్వీయ గణనలో ప్రతిఒక్కరూ భాగస్వాములుకండి
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జన గణనకు సంబంధించి స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)తో కచ్చితమైన డేటాతో పాటు అత్యంత పారదర్శకతకు, సమయం ఆదాకు వీలుంటుందని, ప్రతిఒక్కరూ స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పిలుపునిచ్చారు.
ఆదివారం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానం వద్ద జేసీ ఇలక్కియ 5కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రగతికి కీలమైన ప్రణాళికలు, విధానాల రూపకల్పనకు దోహదం చేసే జనగణన ప్రక్రియలో భాగంగా ఈ నెల 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. https://se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చన్నారు. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించిన అనంతరం 11 అంకెల విశిష్ట సంఖ్య వస్తుందని వివరించారు. భవిష్యత్తులో ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఈ ఐడీని వారికి చూపించడం ద్వారా డేటా ధ్రువీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి డిజిటల్ జన గణన తొలిదశలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి నుంచే మొబైల్ ద్వారా సమాచారాన్ని నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పిలుపునిచ్చారు.
సెన్సస్ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం వల్ల విశ్వసనీయ డేటాతో పాటు విస్తృత ప్రజా భాగస్వామ్యానికి, సమయం ఆదాకు దోహదం చేస్తుందన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తిచేయాలన్నారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా సెన్సస్ ఇన్ఛార్జ్ రమణ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ఎ.రవీంద్ర, ఆర్డీవో టీవీ సతీష్, జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్, డీఎస్డీవో కోటేశ్వరరావు, మెజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.వెంకటరామయ్య, వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు, స్పోర్ట్స్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, వాకర్స్ భారీ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News