-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ/తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం, ధార్మికాభివృద్ధి, సామాజిక సేవలతో పాటు అమరావతి ప్రాంత అభివృద్ధికి కీర్తిశేషులు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమ్యూలమైన సేవలు అందించారని నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని పురస్కరించుకుని తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి ప్రాంత అభివృద్ధికి విశేష సేవలు అందించిన మహోన్నత నాయకుడని అన్నారు. ఆయన పాలనలో ప్రజా సంక్షేమం, ధార్మికాభివృద్ధి, సామాజిక సేవలకు విశేష ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. దేవాలయాల అభివృద్ధి, ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల ఏర్పాటులో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఇటువంటి మహనీయుని జయంతి కార్యక్రమం నిర్వహించడం ద్వారా వారి సేవలను స్మరించుకోవడంతో పాటు, సమాజానికి వారు అందించిన విలువలు, స్ఫూర్తి తదుపరి తరాలకు చేరవేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. యువత మహనీయుల జీవితాల నుండి ప్రేరణ పొందుతూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News