గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం కమిషనర్ ఛాంబర్ నందు ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులతో స్వచ్చ సర్వేక్షన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే స్వచ్చ సర్వేక్షన్ బృందాలు కొన్ని నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయని, గుంటూరు నగరంలో కూడా త్వరలోనే తనిఖీల నిమిత్తం పర్యటిస్తారని తెలిపారు. అందు వలన నగరంలో తప్పని సరిగా డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, పారిశుధ్య పనుల నిర్వహణ పక్కాగా జరిగేలా వార్డుల వారీగా శానిటరీ ఇన్స్పెక్టర్లు భాధ్యత తీసుకోవాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు కార్యదర్శులు తమ పరిధిలో రోడ్ల మీద చెత్త కుప్పలు లేకుండా, ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు వేయకుండా, డ్రైన్లలో సిల్ట్ ను పూర్తి స్తాయిలో తొలగించుటకు ప్రత్యేక డ్రైవ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్ల నుండి చెత్తను సేకరించు సమయంలో వ్యర్ధాలను తడి పొడిగా విభజించి సిబ్బందికి అందజేసేలా వారికి అవగాహన కల్గించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో చెత్తకుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఇళ్లల్లో హోం కంపోస్ట్ తయారు చేసేలా వారికి శిక్షణ ఇవ్వాలని, రీ సైకిల్, రీయూజ్, రెడ్యూస్ (ఆర్ఆర్ఆర్) పై ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు గుంటూరు నగరంలో పచ్చదనం పెంపు, జంక్షన్లను అభివృద్ధి చేయాలన్నారు. నగరంలో ఉన్న ఎస్టీపి, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. నగరంలో ప్రధాన రహదారుల్లో వాల్ పెయింట్స్ వేయించాలని, గుంటూరు నగరాన్నిపోస్టర్ ఫ్రీ సిటీగా చేయాలని, అనధికార బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, ఫుట్ పాత్ లు, డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలు జరగకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమీషనర్ (ఇంచార్జ్) సాంబశివరావు, డిప్యూటి కమీషనర్ సి.హెచ్ శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, యస్.యస్ సుందరరామి రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అనిల్, యస్.యస్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News