గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 1,280 చేనేత కార్మిక కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలు చేయడం జరుగుతుందని చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు సి.హెచ్.సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చేనేత కళాకారుల కుటుంబాలకు, పవర్ లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. హామీ ఇచ్చిన మేరకు 2026 ఏప్రిల్ 1 నుంచి అర్హులైన చేనేత కళాకారుల కుటుంబాలకు 2 వందల యూనిట్ల మేర, పవర్- లూమ్ యూనిట్లకు 5 వందల యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇచ్చుటకు ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ, ఎనర్జీ డిపార్ట్మెంట్ సమన్వయంతో అమలు చేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50,252 చేనేత కళాకారుల కుటుంబాలను, 6,995 పవర్ లూమ్ యూనిట్లను అధికారికంగా గుర్తించి తొలి నెలలోనే సున్నా విద్యుత్ బిల్లులు పొందుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా నెలకు రూ.720/-, సంవత్సరానికి రూ.8,640/- వరకు చేనేత కళాకారుల కుటుంబాలకు, పవర్ లూమ్ యూనిట్లకు నెలకు రూ.1,800/-, ఏడాదికి రూ.21,600/- వరకు లబ్ది చేకూరుతుందన్నారు. గుంటూరు జిల్లాలో చేనేత కార్మికులు ఉచిత విద్యుత్ కు 1,358 అప్లికేషన్స్ సమర్పించగా వాటిలో 1,280 మంది చేనేత కార్మికులు అర్హత సాధించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు నోచుకోవడంతో చేనేత కళాకారులు, పవర్ లూమ్ యూనిట్ల యాజమాన్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
Tags guntur
Check Also
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం
-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …
Prajavartha Online Telugu News