-టెక్నాలజీతో సామాన్యుడికి సేవలందించడం అభినందనీయమని యాప్ నిర్వాహకులను కొనియాడిన మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా మలచుకోవడంలో యువత ముందుండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో స్థానిక అవసరాలే లక్ష్యంగా రూపొందించిన ‘శ్రియో కనెక్ట్’ (Srieyo Connect) యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాప్ నిర్వాహకులు యాప్ పనితీరును, దాని వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రికి వివరించారు. ఈ యాప్ ప్రధానంగా అత్యవసర సమయాల్లో వైద్య సహాయం, బ్లడ్ బ్యాంక్ సమాచారంతో పాటు, స్థానికంగా ఉన్న ఉద్యోగాల వివరాలు, ఖాళీలు, ఉపాధి అవకాశాల అప్డేట్స్ ను అందిస్తుందన్నారు. అంతేగాక విద్యా సంబంధిత సమాచారంతో పాటు స్థానిక అంశాలపై తక్షణ హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. యాప్ను పరిశీలించిన అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు అత్యవసర సేవలను ఒకే చోట అందించేలా ఈ యాప్ను రూపొందించడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మరిన్ని వినూత్నమైన అప్లికేషన్లను సృష్టించాలని యాప్ సృష్టికర్త శివను మరియు బృందాన్ని అభినందించారు. యాప్ సృష్టికర్త శివ మాట్లాడుతూ.. ఈ యాప్ ఓలెక్స్ తరహా లాంటిదని, కేవలం స్థానికంగానే కాకుండా, దేశమంతటా ఉపయోగపడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించామని మంత్రికి వివరించారు. ప్రజలందరికీ తక్షణ సమాచారం చేరవేయడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
Prajavartha Online Telugu News